-“ప్రాజక్టులను పూర్తి చేసేందుకు సీఎం కెసిఆర్ నిద్ర పోవడం లేదు. మంత్రులు, ఎంఎల్ఏలను నిద్ర పోనివ్వడం లేదు.
-తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినదే నీళ్ల కోసం. ఇప్పుడు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకొని ప్రతి పొలానికి నీరవ్యాలనుకుంటున్నాం. తెలంగాణ ఉధ్యమం ఇంకా పూర్తి కాలేదు. ఉద్యమం చేస్తున్నాం తండ్లాట ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ కోసం కోట్లాడినపుడు కూడా మేం ఇంత కష్టపడలేదు . ” అని మంత్రి హరీష్ రావు శుక్రవారంనాడు వరంగల్ పర్యటనలో వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం సాగునీటి పాజక్టులపై చూపుతున్న సీరియస్ నెస్ అధికార యంత్రాంగంలో కనిపించడం లేదని ఇరిగేషన్ మంత్రి టి.హరీష్ రావు మండిపడ్డారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో దేవాదుల ప్రాజెక్టు పనులు, ఎస్ఆర్ఎస్పి మొదటి,రెండోదశ పనులు, భూసేకరణ పురోగతి వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా పరిషత్ చైర్మన్ జి. పద్మ, జిల్లా కలెక్టర్ వి.కరుణ, జాయింట్ కలక్టర్ ప్రశాంత్, ఎంపి దయాకర్,ఎంఎల్ఏ లు శంకర్ నాయక్, ఎర్రబెల్లి దయాకరరావు, కొండా సురేఖ, డాక్టర్ రాజయ్య, ధర్మారడ్డి, రమేష్, ఎంఎల్ సిలు కొండా మురళి, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు పలువురు ఇంజనీర్లకు చురకలంటించారు. అలసత్వం సహించబోనని మంత్రి హెచ్చరించారు. భూసేకరణ తోపాటు ప్రాజెక్టుల పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. రెండేళ్ళు వేచి చూశానని, ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. కఠనంగా ఉండక తప్పదన్నారు. దేవాదుల ప్రాజెక్టు భూసేకరణలో జరుగుతున్న జాప్యం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. భూసేకరణలో వేగం పెంచాలని రవిన్యూ, ఇరిగేషన్ యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు రెవిన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని వెళ్ళాలని కోరారు.భూసేకరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని మంత్రి హరిష్ కోరారు. సాదా బై నామా లతో రిజిస్టే రేషన్ కు ప్రభుత్వం ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఎస్ ఎస్టి బిసి లకు కేటాయించిన అసై న్డు భూముల్లో ప్రస్తుతం ఉన్న వ్యక్తుల కే వాటిని బదలాయించి భూసేకరణ తర్వాత ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మంత్రి హరీష్ కోరారు. దేవాదులకు సంబంధించి వీలైనంత త్వరగా యుద్ధప్రాతిపదికన పెండింగ్ భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ కరుణ , ఇతర అధికారులను మంత్రి కోరారు. ఎస్ఇ, డిఇ, ఇఇ తదితర సిబ్బంది భూసేకరణ పురోగతిపై నిరంతరం మానిటర్ చేయాలని హరీష్ ఆదేశించారు. ప్రాధాన్యతా పరంగా భూసేకరణ జరపాలని సూచించారు. గుడ్డిగా, ఇబ్బడిముబ్బడిగా భూములు సేకరించకుండా అవసరమైన మేరకే సేకరించాలని కోరారు. అర్బన్ ప్రాంతాలలో భూముల ధర ఎక్కవగా ఉన్న దృష్యా ప్రత్యమ్నాయాలు పరిశీలించాలని కోరారు. ఎస్ఆర్ఎస్ పి రెండోదశ కింద పాలకుర్తి నియోజకవర్గంలో45 వేల ఎకరాలకు సాగు నీరందించవలసి ఉండగా 33 వేల ఎకరాల ఆయకట్టుకు సంబంధించి కాలువల తవ్వకం పూర్తయిందని మరో 5 ఎకరాల భూమినిసేకరిస్తే మిగతా 12వేల ఎకరాలకు సైతం ఆయకట్టు లభిస్తుoదన్నారు. పదేళ్ళ క్రితం తవ్విన ఎస్ ఆర్ ఎస్పి కాలువలన్నీ పూర్తిగా చెట్లు, చేమలతో, పూడికతో ఖాయిలా పడ్డాయని కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని మంత్రి హరీష్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ సిబ్బంది తహసీల్దారు కార్యాలయంలో కూర్చొని ఎప్పటికప్పుడు సమీక్షిస్తే భూసేకరణ త్వరగా పూర్తి చేయవచ్చునని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.