వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఎథినిక్ హాల్ వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా “గజాననీయం” కూచిపూడి నృత్యరూపకాన్ని, శిల్పారామం వారి సౌజన్యంతో, సెంట్రల్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ శ్రీ రామలింగశాస్త్రిగారి ఆధ్వర్యంలో వారి శిష్యబృందం ప్రదర్శించారు.
గజాసురుడు గొప్ప శివభక్తుడు. శివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి, శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. శివుడిని తన గర్భంలో నివాసం ఉండేట్లు కోరుకున్నాడు గజాసురుడు. ఇది తెలిసిన పరమేశ్వరి దుఃఖిస్తూ, విష్ణువు దగ్గరికి వెళ్లి, తన పతిని ఎలాగైనా ప్రసాదించమని వేడుకుంది. అప్పుడు నందీశ్వరుడిని తీసుకుని, విష్ణువు, బ్రహ్మ మారువేషంలో గజాసురుడి వద్దకు వెళ్ళారు. నందీశ్వరుడిచేత ఆడించారు. ఆ ఆటకు పరమేశ్వరుడు తన్మయత్వం చెంది గజాసురుడి గర్భంలో తాండవం చేశాడు. ఆ తాండవానికి గజాసురుడి గర్భం చీల్చుకుని పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. కైలాసంలో పార్వతీదేవి స్నానం ఆచరించటానికి ముందు నలుగుపిండితో ఒక బాలుని చేసి, కాపలాగా పెట్టింది. ఆ బాలుడు పరమేశ్వరుని, కైలాస ప్రవేశద్వారం వద్దనే అడ్డుకున్నాడు. అందుకు పరమేశ్వరుడు కోపించి, ఆ బాలుని సంహరించాడు. పార్వతీదేవి ఆ బాలుడు మృతి చెంది ఉండటం చూసి, విలపించి బాలుని బ్రతికించమని కోరింది. విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు ఆ బాలునికి గజాసురుని శిరస్సును అతికించి బ్రతికించాడు. ఈ కథని ఎంతో మనోహరంగా, హృద్యంగా నృత్యరూపకంగా ప్రదర్శించారు.
ఇందులో సురేంద్ర, ప్రవీణ్, అజయ్, వెంకటేశ్వర్లు, ప్రియ, వైష్ణవి, సుష్మిత, సాహిత్య వారివారి పాత్రల్లో జీవించి నృత్యరూపకాన్ని రక్తి కట్టించారు.