8, 9, 10 తేదీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన
అమరావతి, జులై 5 : ఆంధ్రప్రదేశ్ సరికొత్త రాజధాని అమరావతిని అగ్రశ్రేణి ప్రపంచ నగరాల సరసన నిలపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 8, 9, 10 తేదీల్లో ఆయన సింగపూర్లో పర్యటిస్తారు. సింగపూర్లో జరిగే ప్రపంచ నగరాల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. వరుసగా రెండు రోజులు ఆ సదస్సులో కొన్ని ముఖ్యమైన సమావేశాలు, బృంద చర్చల్లో పాల్గొంటారు. పట్టణ, నగరీకరణకు సంబంధించిన అంశాలపై కీలక ప్రసంగాలు చేయనున్నారు. గత విదేశీ పర్యటనల మాదిరే వివిధ దేశాలకు చెందిన పలువురు వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతో భేటీ కానున్నారు.
ఇటీవల సింగపూర్ బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆ దేశ కమ్యూనికేషన్ల మంత్రి ఈశ్వరన్ మేయర్ల సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు సింగపూర్ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి ఈ పర్యటనను అమరావతి అభివృద్ధికి దక్కిన అరుదైన అవకాశంగా వినియోగించుకోనున్నారు. అంతేగాక, రాష్ట్రంలో పెద్దఎత్తున స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేస్తున్నందున వీటన్నింటికీ దోహదపడేలా ఈ పర్యటనకు రూపకల్పన చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, సీఆర్డీఏ, ఏడీసీ, ఈడీబీకి చెందిన అధికారులు వుంటారు.
సింగపూర్లో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే అంతర్జాతీయ స్థాయి ప్రపంచ నగరాల సదస్సు (డబ్ల్యూసీఎస్)లో ఈ పర్యాయం శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమ సింఘేతో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. సుమారు 120 మంది ప్రపంచ నగరాలకు చెందిన మేయర్లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మన నవీన రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.
సింగపూర్ సదస్సులో ‘రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అమరావతికి సంబంధించిన ప్రత్యేక పెవిలియన్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తోంది. సదస్సులో అమరావతి పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) బృందం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. రాజధానిలో పెట్టుబడులకు అవకాశం వున్న వివిధ ప్రాజెక్టులు, అమరావతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ సంస్థల భాగస్వామ్యానికి ఉన్న అవకాశాల్ని పెవిలియన్లో ప్రదర్శిస్తారు.
8వ తేదీన ప్రారంభమయ్యే ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో తొలుత జరగనున్న మేయర్స్ ఫోరమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నారు. 8వ తేదీన ‘లివబుల్ అండ్ సస్టెయినబుల్ సిటీస్; ఎంబ్రాసింగ్ ది ఫ్యూచర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ కొలాబరేషన్’ అనే థీమ్తో జరిపే సదస్సులో ప్రసంగిస్తారు. ‘సాంకేతికతతో సమ్మిళిత వృద్ధి’, ‘రాష్ట్ర, నగర స్థాయి పాలనలో సమన్వయం’ తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆధునిక నగరాలలో ఉండాల్సిన సమతుల్య అభివృద్ది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పరిపాలనా సంస్థల మధ్య ఉండాల్సిన సమన్వయం, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడంలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.
ఇక, అదేరోజు సాయంత్రం వివిధ దేశాల మేయర్లు, ప్రతినిధులతో జరిగే విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఆ సందర్భంలోనే వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.
9వ తేదీన జరిగే ప్లీనరీ సెషన్లో నగరీకరణకు సంబంధించిన అంశాలపై జరిపే చర్చల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆరోజు ఉదయం జరిగే జాయింట్ ఓపెనింగ్ ప్లీనరీ సదస్సులో శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘేతో కలిసి పాల్గొంటారు. సింగపూర్ పెవిలియన్లో ‘అర్బనైజేషన్-వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్’ అనే అంశంపై వరల్డ్ బ్యాంక్ సీఈవో క్రిస్టాలినా జార్జివా, యుఏఈ పర్యావరణ మంత్రి డాక్టర్ థాని అల్ జియోడీ, జాకోబ్స్ చైర్మన్ స్టీవెన్ డెమెట్రూ, డస్సాల్ట్స్ సిస్టమ్స్ వైస్ చైర్మన్ బెర్నార్డ్ చార్లెస్లతో కలిసి ప్యానల్ డిస్కషన్లో పాల్గొంటారు.
సింగపూర్ దేశానికి చెందిన నలుగురు మంత్రులతో ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భేటీ అవుతారు. సింగపూర్ ఆర్థిక మంత్రి హెంగ్ స్వీ కియెట్, నేషనల్ డెవలప్మెంట్ మంత్రి లారెన్స్ వోంగ్, కమ్యూనికేషన్ల మంత్రి ఈశ్వరన్, కుటుంబ, సామాజిక, జాతీయాభివృద్ధి శాఖ మంత్రి డెస్మాండ్ లీ టీ సెంగ్తో ఇప్పటికే సమావేశాలు ఖరారయ్యాయి. వీరుగాక సింగపూర్ ప్రెసిడెంట్ హలీమా యాకోబ్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ థర్మన్ షణ్ముగరత్నం, శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమ సింఘేలతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు.
సింగపూర్లోని ప్రఖ్యాత లీ క్వాన్ యూ ఇనిస్టిట్యూట్లో జరిగే ‘లీ క్వాన్ యూ ప్రైజ్ అవార్డు కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షురాలు హలీమా యాకోబ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. మేయర్స్ ఫోరం ముఖ్యుడు ప్రొఫెసర్ గ్రెగ్ క్లార్క్, ఏఐఐబీ డైరెక్టర్ జనరల్ పాంగ్ ఈ యాన్, ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూపుకు చెందిన గౌతమ్ వర్మ, రాయల్ హోల్డింగ్స్ ప్రతినిధి రాజ్ కుమార్ హీరానందానీ, ఎలీ హజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీశ్, ఎన్ఈసీ లేబొరేటరీస్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ కత్సుమి ఎమురా, కెప్పెల్ ల్యాండ్ సంస్థకు చెందిన లూయీస్ లిమ్, ఇంకా, అభిషేక్ మంగళ్ ప్రభాత్ లోథా, డస్సాల్ట్స్ సిస్టమ్స్ ప్రతినిధులు, మలేసియన్ రైల్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశాలు జరుపుతారు. ఏపీలో వ్యాపార సానుకూలతలను వివరించి పెట్టుబడుల ఆకర్షణకు కృషి చేస్తారు.
సింగపూర్ పర్యటనలో రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన అంశంపై కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టనున్నారు. జర్మన్ అగ్రి బిజినెస్ ప్రతినిధులతో జరిపే సమావేశం దీనికి వేదిక కానున్నది. జర్మనీ టెక్నాలజీతో సింగపూర్ వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలను అనుసరిస్తోంది. జర్మన్ సాంకేతికతను మేళవించి సింగపూర్ సహకారంతో వ్యవసాయ దిగుబడులను ఎలా పెంచాలన్న అంశంపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి.నారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్, కమిషనర్ చెరుకూరి శ్రీధర్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ తదితరులు ముఖ్యమంత్రి బృందంలో వుంటారు.
నిర్మాణరంగ నగరం ఏర్పాటులో ముందడుగు
ముఖ్యంగా రాష్ట్ర నిర్మాణ రంగ ప్రముఖులతో కూడిన ఒక ప్రత్యేక బృందం తమ సొంత ఖర్చులతో ముఖ్యమంత్రి వెంట సింగపూర్ వెళ్తుండటం ఈ పర్యటనలో విశేషం. రాష్ట్రంలో పెద్దఎత్తున నిర్మాణరంగ కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రంగంలో అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత, సరికొత్త నిర్మాణ విధానాలు, పద్ధతులపై మనవారికి అవగాహన కల్పించి వారిని ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ బృందాన్ని తోడ్కొని వెళ్తున్నారు. ఈ బృందంలో 15 మంది ప్రముఖ నిర్మాణదారులు, పేరొందిన ప్రీకాస్ట్ తయారీదారులు, కన్సల్టెంట్లు, ఆర్కిటెక్టులు, డిజైనర్లు ఇలా నిర్మాణరంగానికి చెందిన 30 నుంచి 40 మంది ప్రముఖులు వుంటారు.
నిర్మాణ రంగ ప్రతినిధుల బృందాన్ని మేయర్ల సదస్సులో పరిచయం చేయనున్న ముఖ్యమంత్రి అంతర్జాతీయంగా ఈ రంగంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధి పరిణామాలను వారితో కలిసి పరిశీలిస్తారు. ప్రకాశం జిల్లా అలాగే, దొనకొండలో నెలకొల్పనున్న నిర్మాణ నగరానికి సంబంధించిన కీలకమైన ఘట్టానికి సింగపూర్ పర్యటన దోహదపడనున్నది. సింగపూర్ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. చైనాలో వున్నట్టుగా నిర్మాణ రంగానికి సంబంధించిన సమస్త వస్తు సామాగ్రి, సాంకేతికత ఒకేచోట లభ్యమయ్యేలా నిర్మాణ నగరాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణరంగ అవసరాలకు సంబంధించిన వస్తు సామాగ్రి తయారీ పరశ్రమలన్నీ ఒకేచోట కొలువుదీరితే అది అటు సరఫరాదారులకు, ఇటు తయారీదారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. నిర్మాణ సామాగ్రి తయారీ పరిశ్రమలే కాకుండా, నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న అనేకానేక మార్పులు, నవ్యావిష్కరణలకు కేంద్రంగా, సాంకేతిక వైజ్ఞానిక కేంద్రంగా దీన్ని అభివృద్ది చేస్తారు. ఇప్పటికే ఈ విషయంలో సింగపూర్ సాధించిన ప్రగతి మనకు అక్కరకొస్తుందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాలలో ఉంది. గాలి స్వచ్ఛత, ధ్వని కాలుష్యం, వైపరీత్యాల నిర్వహణ తదితర అంశాలలో ఆ దేశం అత్యంత ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నది. దీర్ఘకాలం మన్నిక, అందుబాటు ధర, ఆకట్టుకునే ఆకృతులు, ఆధునిక నగర ప్రణాళికలకు సంబంధించిన నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు సింగపూర్ తోడ్పాటు దోహదపడుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్య ప్రణాళికలో భాగంగానే నిర్మాణ రంగానికి చెందిన ఆర్కిటెక్టులు, రియల్టర్లు, కనస్ట్రక్షన్ రంగ వ్యాపారవేత్తలు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ముఖ్యమంత్రి అక్కడికి తీసుకువెళుతున్నారు.
9. 10 తేదీలలో నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టనున్నారు. 9వ తేదీన నిర్మాణ రంగానికి చెందిన బృందాన్ని తీసుకుని క్షేత్ర పర్యటన చేస్తారు. ఎఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లను పరిశీలిస్తారు. తరువాత సింగపూర్ ప్రభుత్వ సంస్థ ‘బిల్డింగ్ కనస్ట్రక్షన్ అథారిటీ’ కార్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. అక్కడ సింగపూర్ బీసీఏ అధికారులు ఏపీ బృందానికి ఈ రంగంలో తాము సాధించిన ప్రగతిపై ప్రెజెంటేషన్ అందిస్తారు. తరువాత సింగపూర్ నిర్మాణ రంగానికి చెందిన 40 మంది ప్రతినిధులు, ఏపీకి చెందిన నిర్మాణ రంగ ప్రతినిధులతో కలిసి జరిపే రౌండ్ టేబుల్ సమావేశం అత్యంత కీలకంగా నిలిచిపోనున్నది. దొనకొండలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కనస్ట్రక్షన్ సిటీలో తమ యూనిట్లు ప్రారంభించి ఇక్కడ ఉన్న వ్యాపార సానుకూలతలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సింగపూర్ వాణిజ్య, పారిశ్రామిక ప్రతినిధులకు పిలుపునివ్వనున్నారు. 10 వ తేదీన మళ్లీ నిర్మాణ రంగ ప్రతినిధుల బృందంతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్లోని ప్రఖ్యాత పియోంగ్ స్టాంగ్ ప్రీకాస్ట్ మెటీరియల్ ప్లాంటును సందర్శిస్తారు. తరువాత సింగపూర్ కనస్ర్ట్క్షక్షన్ ఎక్విప్మెంట్ ప్లాంటుకు వెళ్ళి అక్కడున్న అత్యాధునిక నిర్మాణ యంత్ర సామాగ్రిని పరిశీలిస్తారు.