సమాజ్ వాది పార్టీలో, తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. అంతా ఐక్యంగా ఉన్నామని చెప్పారు. కొన్ని రోజులుగా కుటుంబంలో ఏర్పడిన విభేదాలు నిన్న రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలో ములాయం ఇవాళ లక్నోలో మీడియా ముందుకు వచ్చారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చిచెప్పారు. అఖిలేష్ ని తప్పించి మీరు సీఎం అయితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్న విలేకరి ప్రశ్నకు.. మరో రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్నాం, ఇప్పుడు ఆ ఆలోచనకు తావు లేదని ములాయం అన్నారు. 2017లో జరిగే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది గెలిచిన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని ప్రకటించారు.
తనపై పార్టీలో కుట్ర జరుగుతోందని యూపీ సీఎం అఖిలేష్ తాజాగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇటీవల పార్టీలో తిరిగి చేరిన అమర్ సింగ్ పేరుని ఓ విలేకరి ప్రస్తావించారు. ప్రతి విషయంలో ఆయన పేరు ఎందుకు తీసుకొస్తారని ములాయం తోసిపుచ్చారు. అఖిలేష్ పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని, పార్టీకి కొత్త ఇమేజ్ తీసుకొచ్చారని ఆయన ప్రశంసించారు. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ సహా ఇటీవల తొలగించిన నలుగురు మంత్రులను తిరిగి మంత్రివర్గంలో చేర్చుకునే విషయంలో సీఎం అఖిలేష్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 2012 యూపీ ఎన్నికల్లో తన వల్లనే మెజారిటీ సీట్లు గెలిచామని, ఐతే అఖిలేష్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించామని అన్నారు. తాము రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమన్నారు.