రైతులు ఎన్నో ఇబ్బందులు పడి పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడితే, నకిలీ విత్తన తయారీదారుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తన తయారీదారులపై పీడీ యాక్టులు నమోదు చేసి ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నకిలీ విత్తనాల అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు తయారు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపి అనురాగ్ శర్మలను ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో నకిలీ విత్తనాల సమస్య వెలుగు చూసిన అంశంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ నకిలీ విత్తనాల అంశంపై తక్షణమే విచారణ జరిపించి ముగ్గురు కలెక్టర్లతో నివేదిక తెప్పించి, సంబంధిత నకిలీవిత్తన తయారీదారులపై పీడీ యాక్టులు నమోదు చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం పేకాట, గుడుంబా, గుట్కాను తరిమికొట్టడంలో విజయం సాధించిందని ఆ తరహాలోనే రాష్ట్రం నుంచి నకిలి విత్తన తయారీదారులు పారిపోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు మార్కెట్ లో విక్రయించకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారుల మీద వెంటనే విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తన తయారీదారుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశాలనూ చట్టపరంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రజలకు నష్టం చేకూర్చే అక్రమార్కుల విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితిల్లోనూ రాజీపడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లాలు పెరగనున్న నేపథ్యంలో కొత్తగా వచ్చే కలెక్టర్లు, ఎస్పీలు నకిలీవిత్తన తయారీదారులవంటి సంఘవ్యతిరేక శక్తులపై పూర్తిస్థాయిలో నిఘాపెట్టే అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తజిల్లాల ఏర్పాటు తర్వాత జరిగే కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఈ అంశం గురించి పూర్తి స్థాయిలో సమీక్షించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సిటీ పోలీసు కమీషనర్ మహేందర్ రెడ్డి, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి శాంతికుమారి, సిఎంఓ ఉన్నతాధికారులు స్మితసబర్వాల్, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.