శ్రీశైల దేవస్థానం:
*శ్రావణమాస ఏర్పాట్లపై ప్రాథమిక సమావేశం
• ఆగస్టు 13న శ్రావణమాసోత్సవాలు ప్రారంభం
• సెప్టెంబరు 12వ తేదీన ముగియనున్న శ్రావణ మాసోత్సవాలు
• శ్రావణ మాసోత్సవాలపై ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించిన కార్యనిర్వహణాధికారి
• రాబోవు ధర్మకర్తల మండలి సమావేశంలో ఉత్సవ నిర్వహణకు సంబంధించి కూలంకష చర్చ
శ్రావణశుద్ధ పాడ్యమి, ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తారు. భాద్రశుద్ధ పాడ్యమి సెప్టెంబరు 12 ఉదయాన ఈ మాసోత్సవాలు ముగుస్తాయి.
ఈ మాసోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.
పరిపాలనా కార్యాలయములోని సమావేశ మందిరములో నిర్వహించిన ఈ సమావేశంలో అర్చకస్వాములు, వేదపండితులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రావణమాస ఏర్పాట్లపై రాబోవు ధర్మకర్తల మండలి సమావేశంలో కూలంకషంగా చర్చించి తదనుగుణంగా చర్యలు వుంటాయన్నారు.
ఈ శ్రావణమాసోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారన్నారు.
ముఖ్యంగా శ్రావణ మాసంలో రద్దీ దృష్ట్యా అన్ని విభాగాలు కూడా తగు ముందస్తు ప్రణాళికలతో ఉత్సవ నిర్వహణకు సిద్ధం కావాలని ఆదేశించారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల వారు కూడా ముందస్తుగా ఆయా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు
అదేవిధంగా శ్రావణమాసములో ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, శ్రావణపౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, శుద్ధ మరియు బహుళ ఏకాదశి రోజులు, శ్రావణమాసశివరాత్రి మరియు ప్రభుత్వ సెలవురోజులలో అధికసంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందన్నారు.
ఆయా విభాగాల వారీగా చేపట్టవలసిన చర్యల గురించి కార్యనిర్వహణాధికారి దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆలయ మరియు క్యూకాంప్లెక్సు విభాగాన్ని ఆదేశించారు.
క్యూలైన్లలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం భక్తులందరికీ కూడా ఎప్పటికప్పుడు మంచినీరు, అల్పాహారం మరియు బిస్కెట్లను అందజేయాలని అన్నప్రసాద వితరణ విభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా భక్తుల రద్దీకనుగుణంగా అన్నదాన మందిరంలో అన్నప్రసాదవితరణను, సాయంకాలం అల్పాహారాన్ని ఏర్పాటు చేయాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు. అన్నప్రసాద వితరణలో వండిన వంటకాలన్నీ ప్రతీ భక్తుడికి అందాలన్నారు. అన్నప్రసాదం స్వీకరించే భక్తుడికి కూడా ప్రతీ వంటకం అందాలన్నారు.
భక్తులరద్దీకనుగుణంగా అవసరమైన మేరకు లడ్డూ ప్రసాదాలను తయారు చేసి అందుబాటులో ఉంచాలని ప్రసాదాల విభాగాన్ని ఆదేశించారు.
భక్తులు లడ్డూప్రసాదాల కోసం అధికసమయం వేచివుండకుండా త్వరితంగా లడ్డూప్రసాదాలను అందజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అవసరం మేరకు అదనపు లడ్డు కౌంటర్లను ఏర్పాటు చేయాలని ప్రసాదాల విక్రయ విభాగాన్ని ఆదేశించారు.
రద్దీరోజులలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై స్థానిక పోలీస్ శాఖ వారి సహకారాన్ని పొందాలని సూచించారు
భక్తులరద్దీ దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు ఆయా ఏర్పాట్లను చేయాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు. అదేవిధంగా ప్రతీ సంవత్సరం వలనే శ్రావణ అఖండ శివనామ భజనలకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు.
శ్రావణమాసోత్సవాలను పురస్కరించుకుని సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని ఆదేశించారు. మొత్తం మీద భక్తులకు, ముఖ్యంగా సర్వదర్శనం క్యూలైన్లలోని సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాలను సూచించారు.
