
శ్రీశైల దేవస్థానం:ఫిబ్రవరి 19న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం కార్యక్రమాలతో ముగింపు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు.
దేవస్థానం వైదిక కమిటీ, దేవస్థానం అన్నిశాఖల అధికారులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు, పలువురు సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయగలిగామని వివరించారు.
గత నెల 10వ తేదీన జరిగిన మంత్రుల బృందం , స్థానిక శాసనసభ్యులు జరిపిన సమీక్షా సమావేశంలో చేసిన పలు ఆదేశాల మేరకు భక్తులకు మరిన్ని సదుపాయాలను కల్పించామన్నారు.
కాగా అప్పటి ఈ సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రి శ్రీమతి వి. అనిత, రోడ్లు, భవనాలు , పెట్టుబడుల శాఖ మంత్రి బి. జనార్థన్రెడ్డి, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. ఆ సమావేశంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా కూడా దేవదాయశాఖమంత్రి పేర్కొనడం గమనార్హం.
కాగా ఈ రోజు జరిగిన సమావేశంలో కార్యనిర్వహణాధికారి తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ మంత్రుల బృందం, స్థానిక శాసనసభ్యులు ఉత్సవాల నిర్వహణకు ఎంతగానో దిశానిర్దేశం చేశారన్నారు. ఉత్సవ ఏర్పాట్లను దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, స్థానిక శాసన సభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డితో కలిసి ఉత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై వారు భక్తుల అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగిందన్నారు.
స్థానిక శాసనసభ్యుల కూడా ఉత్సవాలలో సుమారు అయిదు రోజులపాటు క్షేత్రంలోనే ఉండి ఆయా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారన్నారు. ఉత్సవ నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు తగు సూచనలను, సలహాలను అందజేశారన్నారు.
అదేవిధంగా రాష్ట్ర దేవాదాయశాఖ కార్యదర్శి వాడరేవు వినయ ్చంద్, దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ శ్రీమతి. రాజకుమారి, కర్నూలు రేంజ్ డి.ఐ.జి కె. ప్రవీణ్, నంద్యాల జిల్లా ఇంఛార్జి ఎస్పి విక్రాంత్ పాటిల్ ఎప్పటికప్పుడు తగు సూచనలు చేయడంతో పాటు ఏర్పాట్లను సమీక్షించారన్నారు. పలుసార్లు ఏర్పాట్లను పరిశీలించారన్నారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర ఆజాద్ ఉత్సవాల నిర్వహణలో పాల్గొనడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రభుత్వశాఖ అధికారులు వారి సిబ్బంది ఉత్సవాలలో ప్రత్యేక విధులకు హాజరయ్యారన్నారు. జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది అందరు కూడా ఉత్సవాల నిర్వహణకు ఎంతగానో శ్రమించారన్నారు. పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించి ఉత్సవాల నిర్వహణలో దేవస్థానం సిబ్బంది అందరు కూడా ప్రశంసనీయ పాత్రను పోషించారన్నారు.
గత సంవత్సరం కంటే అధిక సంఖ్యలో భక్తులు ఈ సంవత్సరం ఉత్సవాలలో క్షేత్రాన్ని సందర్శించారన్నారు. ఉత్సవాలలో మహాశివరాత్రి రోజు వరకు కూడా దాదాపుగా ప్రతీరోజు కూడా గతంలో కంటే కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించడం జరిగిందన్నారు.మహాశివరాత్రి పర్వదినం రోజున అత్యధికంగా 1,05,906 మంది భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారన్నారు. గత సంవత్సరం మహాశివరాత్రి రోజున 1,00,950 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించడం జరిగిందన్నారు.
మహాశివరాత్రి రోజున ఇంత ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి అన్నారు. అదేవిధంగా ఉత్సవాలలో నాలుగు రోజులపాటు ఉచిత లడ్డు ప్రసాద వితరణను చేపట్టడం జరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలో 10 ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు మంచినీటి సీసాలను కూడా అందించడం జరిగిందన్నారు. ఉత్సవాలలో సాంకేతికను వీలైనంత మేరకు వినియోగించుకోవడం జరిగిందన్నారు. గుర్తింపు కార్డులలో డిజిటల్ విధానంలో అందజేయడం జరిగిందన్నారు.
క్యూలైన్లు, క్యూలైన్లహోల్డింగు ప్రదేశాలు, పార్కింగు ప్రదేశాలు, ఆరుబయలు ప్రదేశాలలో చలువపందిర్లు, ఆరుబయలు ప్రదేశాలలో లైటింగు ఏర్పాట్లు, శాశ్వత శౌచాలయాలు, తాత్కాలిక శౌచాలయాలు మొదలైన ఏర్పాట్లన్నీ కూడా గత సంవత్సరం కంటే కూడా అధికంగా చేయడం వలనే భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను సజావుగా నిర్వహించగలిగామన్నారు. అందరి సమిష్టి కృషివలనే ఉత్సవాలు విజయవంతమయ్యాయన్నారు.
ఈ సమావేశంలో దేవస్థానం పలుశాఖల అధిపతులు, పలు విభాగాల పర్యవేక్షకులు కూడా ప్రసంగించారు.