
శ్రీశైల దేవస్థానం:ఈ నెల 3 నుండి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ దసరా మహోత్సవాలు 12వ తేదీతో ముగియనున్నాయి.
భక్తులు ఆయా ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్.ఈ.డి స్క్రీనును ఏర్పాటు చేస్తారు.
ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేకపూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు, లోకకల్యాణం కోసం జపపారాయణలు నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలకు నాందిగా రేపు ( 03.10.2024) న ఉదయం 8.00 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేసి గణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనము, దీక్షాసంకల్పం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణపూజ, కంకణధారణ నిర్వహిస్తారు.
తరువాత అమ్మవారి యాగశాలలో అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, నవగ్రహ మండపారాధన, చండీ కలశస్థాపనము, చతుర్వేద పారాయణలు, విశేష కుంకుమార్చనలు, గణపతి పంచాక్షరీ, సుబ్రహ్మణ్మ, బాల, నవగ్రహ జపానుష్ఠాలు, సూర్యనమస్కారాలు, కుంకుమార్చనలు, కుమారి పూజలు జరుగుతాయి.
అదేవిధంగా 9.30 గంటలకు శ్రీస్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశంచేసి శివసంకల్పం, గణపతిపూజ, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నకాలార్చనలు, మహానివేదనలు జరుగుతాయి.
ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం నుండి అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, రుద్రహోమం, అమ్మవారికి నవావరణార్చన, కుంకుమార్చనలు జరుగుతాయి..
ఆ తరువాత రుద్రహోమం, చండీహోమం జరిపించబడుతాయి. అనంతరం రాత్రి 9.30గంటల నుండి సువాసినిపూజ, నీరాజనమంత్రపుష్పములు, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ కార్యక్రమ నిర్వహణకు వివిధ ప్రాంతాల నుండి సుమారు 50 మంది ఋత్వికులను పిలిపించారు. దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు వీరు కూడా ఉత్సవ నిర్వహణలో పాల్గొంటున్నారు.
*దసరా మహోత్సవాలకు రాష్ట్ర గవర్నరుకు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు