శ్రీశైల దేవస్థానం:సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో జూన్ 29, తొలిఏకాదశి పర్వదినం రోజున శ్రీమల్లికార్జునస్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారని ఈ ఓ లవన్న తెలిపారు. శనివారం ఈ ఓ మీడియా తో మాట్లాడారు. వివరాలు ఇవి.
- కార్యక్రమములో భాగంగా మూడు రోజులపాటు అనగా జూన్ 27వ తేదీ నుంచి 29 వరకు
జపపారాయణలు జరుగుతాయి.
- రుద్రపారాయణ, విరాటపర్వపారాయణ, వారుణానువాక పారాయణ, కాఠకపారాయణలు, పంచాక్షరీజపం, ఋష్యశృంగ జపం, వరుణ జపాలు నిర్వహిస్తారు.
- 27వ తేదీ ఉదయం గణపతిపూజ, ఋత్విగ్వరణం, పుణ్యాహవచనం, మండపారాధన, కలశస్థాపన
కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం ఆయా జపపారాయణలు ప్రారంభమవుతాయి.
29వ తేదీన ఉదయం రుద్రహోమం కూడా జరుగుతుంది.
దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రానున్న సుమారు 16మంది ఋత్వికులు కూడా ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సహస్రఘటాభిషేకం సందర్భంగా 29వ తేదీన అన్నీ ఆర్జితసేవలు కూడా నిలుపుదల చేస్తారు. సహస్రఘటాభిషేకం సందర్భంగా 28వ తేదీ రాత్రి దర్శనాలు ముగిసిన తరువాత స్వామివారి గర్భాలయ ద్వారం వద్ద తాత్కాలిక గోడ నిర్మిస్తారు.
29వ తేదీన ఉదయం గం.9.00ల నుంచి గం. 12.00ల వరకు ఘటాభిషేకం నిర్వహిస్తారు.
29వ తేదీన సహస్ర ఘటాభిషేకం ప్రారంభమయ్యేంతవరకు కూడా అనగా ఉదయం గం.9. వరకు భక్తులకు అమ్మవారి దర్శనం మాత్రమే కల్పిస్తారు.
- సహస్రఘటాభిషేకం కారణంగా ఆ రోజంతా స్వామివారు ఘటాభిషేకజలంలోనే ఉంటారు. మరుసటిరోజు అనగా 30వ తేదీన వేకువజామున మంగళవాయిద్యాలకు ముందుగా ఘటాభిషేక జలాన్ని తొలగించి యథావిధిగా ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తారు.
- భక్తులు అందరు కూడా 29వ తేదీన ఆర్జితసేవల నిలుపుదల విషయాన్ని గమనించవలసిందిగా దేవస్థానం కోరింది.