
శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జూలై 13వ తేదీన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయాలతోనూ, ఆకుకూరలతోనూ, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించడం ఆనవాయితి. అమ్మవారికి ఉత్సవ సంబంధి విశేష పూజలు జరుగుతాయి. దేవాలయ ప్రాంగణం కూడా పలు రకాల ఆకుకూరలు, కూరగాయాలతో అలంకరిస్తారు.
ఉత్సవంలో భాగంగానే శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవికి, సప్తమాతృకలకు, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేక పూజలు, విశేషంగా శాకాలంకరణ చేస్తారు.
ఉత్సవం లో ఆయా రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల పండ్లు వినియోగించి అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు నివారించబడతాయని నమ్మకం.
పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్జానం చేశాడు. దాంతో యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్ర క్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోక రక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.
ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి, క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన ఆ పరాశక్తి స్వరూపమే శాకంభరీదేవి. ఈ కారణంగానే ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాలతో అలంకరించి ఆర్చించే సంప్రదాయం ఏర్పడింది.
| భక్తులకు సదవకాశం :
ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారిని, ఇతర దేవతా మూర్తులను, ఆలయ ప్రాంగణాన్ని అలంకరించడానికి భక్తులు వివిధ కూరగాయలు, ఆకుకూరలు, ఫలములను దేవస్థానానికి విరాళంగా సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన భక్తులు తేది.12.07.2022 మధ్యాహ్నం లోగా దేవస్థానం ఉద్యానవన విభాగాధిపతి కి అందజేయవచ్చును.