తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు – ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు
తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని, ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం హరితహారం పై సమీక్ష నిర్వహించారు. అధికారులు సమర్పించిన నివేదికలతో పాటు వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని సిఎం సమీక్షించారు.
ప్రజల్లో మొక్కలు నాటాలనే ఉత్సాహం బాగా పెరిగిందని, మంచి వర్షాలు పడుతున్నాయని, హరితహారం కార్యక్రమ నిర్వహణకు పూర్తి అనుకూల పరిస్థితి ఉందని సిఎం అన్నారు. చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు బాగానే పనిచేస్తున్నప్పటికీ, కొద్ది మందిలో ఉదాసీనత ఉందని సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. జిల్లలో ఏ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో బాగా పాల్గొంటున్నారో, ఎవరు పాల్గొనడం లేదో మంత్రులకు సిఎం చెప్పారు. అందరూ కలిసి బాగా పనిచేయాలని మరో సారి కోరారు.
భూభాగంపై 33 శాతం అడవులుంటేనే వాతావరణం సమతుల్యంగా ఉంటుందని చెప్పారు. మొక్కల పెంపకాన్ని కూడా శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా చూడాలి తప్ప వేరే కార్యక్రమంగా భావించరాదని సిఎం చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వచ్చే జూన్ వరకు ఇప్పుడు నాటిన మొక్కలను రక్షించగలిగితే అవి బతికినట్టేనన్నారు. వర్షాకాలంలో వాటికి పెద్దగా నీటి అవసరం లేకున్నా ఎండా కాలంలో అవసరం ఉంటుందని చెప్పారు. ఫైర్ ఇంజన్లను, వాటర్ ట్యాంకర్లను వాడుకోవాలని, ప్రభుత్వ శాఖలన్నిటినీ భాగస్వామ్యం చేయాలని సిఎం చెప్పారు జిల్లా, డివిజన్, మండలం, గ్రామాల వారీగా మొక్కలు నాటడం, వాటిని రక్షించడంపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ప్రతీ డివిజన్ కు ఒక అటవీశాఖ సీనియర్ అధికారిని ఇంచార్జిగా నియమించి హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సిఎం చెప్పారు. గ్రామస్థాయి నుంచి కూడా ప్రతీ రోజు హరితహారం కార్యక్రమంపై వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమీక్ష జరపాలని ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించారు. అధికారుల పనితీరుకు, ప్రజాప్రతినిధులు అవకాశాలు కల్పించడానికి హరితహారంలో వారి భాగస్వామ్యం కొలమానం అవుతుందని సిఎం మరోసారి స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో బాగా పనిచేసిన వారికి ఆగస్టు 15 వేడుకల్లో హరితమిత్ర అవార్డులు ఇవ్వనున్నట్లు సిఎం వెల్లడించారు.