- విద్యాభివృద్ధి రుణాలకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయింపు ఇవ్వండి…
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- ముఖ్యమంత్రి విద్యా రంగంపై పెడుతున్న శ్రద్ధకు కేంద్ర మంత్రి ప్రశంసలు
ఢిల్లీ: తెలంగాణ విద్యా రంగాభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పార్లమెంట్లోని ఆమె ఛాంబర్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (YIIRS) ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. 5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో YIIRSలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, మొత్తంగా 105 పాఠశాలతో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని సీఎం వివరించారు. YIIRSలు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యా హబ్లుగా ఉండడంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం తెలియజేశారు.
అత్యాధునిక వసతులు, లేబొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో విద్యా రంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించినున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPC) ఏర్పాటు చేయాదల్చామని, దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు… తెలంగాణలో విద్యా రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. YIIRS మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి SPCకి సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్ పాల్గొన్నారు.
…………………………………………………………………………………………………………..
- హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయండి….
- కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి
- కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
ఢిల్లీ: హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎం లు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి సీఎం వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్పనకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్ కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉందని, అనుకూల వాతావరణం, భిన్న రంగాల ప్రముఖులను అందజేసిన చరిత్ర హైదరాబాద్కు ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేస్తే అది తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లల అవకాశాలను మెరుగుపర్చుతుందని సీఎం అన్నారు.
తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అవసరం ఉందని సీఎం అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
