శ్రీశైల దేవస్థానం: గతంలో రూ.1500/-ల రుసుముతో శ్రీస్వామివారి సామూహిక ఆర్జిత అభిషేకాలు అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రతీరోజు మూడు విడతలుగా జరిగేవి.
అక్కమహాదేవి అలంకార మండపానికి మరమ్మతులు నిర్వహిస్తున్న కారణంగా ప్రస్తుతం ఈ సామూహిక అభిషేకాలను శ్రీస్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణమండపంలో నిర్వహిస్తున్నారు.
కాగా ఈ సామూహిక ఆర్జిత అభిషేకాలను నిత్య కల్యాణమండపంలో నిర్వహించడం వలన కొన్ని సందర్భాలలో ప్రతీరోజు ఉదయం జరిగే శ్రీవల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణం , సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవంలో కాలతీతమయ్యే ఇబ్బంది కలుగుతోంది.
ఈ కారణంగా ప్రస్తుతం నిత్యకల్యాణమండపంలో నిర్వహిస్తున్న ఈ సామూహిక ఆర్జిత అభిషేకాలు ఇకమీదట ఆలయప్రాంగణములోని మూడు శివాలయాల వద్ద ( సహస్రదీపాలంకరణ సేవా మండపం వెనుక) , అక్కమహాదేవి – హేమారెడ్డి మల్లమ్మ మందిరాల ( నవబ్రహ్మ ఆలయాల ప్రక్కన) వద్ద నిర్వహిస్తారు.
గతంలో వలనే యథావిధిగా రోజుకు మూడు విడతలుగా ఉదయం గం.6.00లకు, మధ్యాహ్నం గం.12.00లకు , రాత్రి గం.7.00లకు ఈ సామూహిక ఆర్జిత అభిషేకాలను నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క విడతలో 100 టికెట్లు మాత్రమే ఇస్తారు.
భక్తులు గతంలో వలనే ఈ టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవలసి వుంటుంది.
మరమ్మతులు పూర్తి అయిన వెంటనే ఈ సామూహిక ఆర్జిత అభిషేకాలను తిరిగి అక్కమహాదేవి అలంకార మండపంలోనే నిర్వహిస్తారు.
తదుపరి ప్రతీమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రము రోజున ఉదయం వేళల్లో శ్రీస్వామివారికి దేవస్థానం సేవను ( సర్కారీసేవ) నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా ప్రతీనెలలో మాసశివరాత్రి రోజున సాయంకాలం శ్రీస్వామివారికి దేవస్థానం సేవను (సర్కారీసేవను నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా స్వామివారి ఆరుద్ర నక్షత్రం రోజున ఉదయం వేళల్లో , మాసశివరాత్రిరోజున సాయంకాలం వేళల్లో శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లను నిలుపుదల చేశారు.
భక్తులు ఈ మార్పులను గమనించవలసినదిగా దేవస్థానం కోరింది.