నందీశ్వరస్వామివారికి పరోక్షసేవగా విశేషార్చన
శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (31.12.2021)న నందీశ్వరస్వామివారికి పరోక్షసేవగా విశేషార్చన జరిగింది.
ప్రతి మంగళవారం రోజున, త్రయోదశి రోజులలో దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం చేస్తారు.
అయితే ప్రతి నెలలో కూడా త్రయోదశి రోజులలో అనగా శుద్ధ త్రయోదశి , బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను భక్తులు పరోక్ష సేవగా జరిపించుకునే అవకాశం కల్పించారు.
ఈ పూజాదికాలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోను , పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షాదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేసారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిగింది.
పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో ఈ విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను జరిగాయి. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన జరిగింది.
కాగా నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
నందీశ్వరస్వామివారి ఆరాధన వలన సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, ఋణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు.
ఈ స్వామికి నానబెట్టిన శనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. అందుకే ఈ స్వామివారికి శనగలబసవన్న అనే పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది. భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/52/53/54/ 55/56 లను సంప్రదించవచ్చును.
Post Comment