శ్రీశైల దేవస్థానం: ఉద్యానవనాల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు, క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు విస్తృతంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని దేవస్థానం నిర్ణయించింది.వర్షాకాలం ముగిసేలోగా భారీగా మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ఇందులో భాగంగా ఈ రోజు కార్యనిర్వహణాధికారి క్షేత్రములోని పలు ఉద్యానవనాలను, ఆరుబయలు ప్రదేశాలను పరిశీలించారు.పాతాళగంగమార్గంలోని సర్వతోభద్రవనం, ఆ వనములో నర్సరీ, బసవవనం, బాలగణేశవనం, మల్లమ్మవనం, వలయ రహదారి, దేవస్థానం గోశాల మొదలైన వాటిని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ పరిశీలనలో ఆయా ఉద్యానవనాలలో పనులు నిర్వర్తిస్తున్న తోటమాలీల వివరాలు, వారి డ్యూటీచార్టు, హాజరునమోదు మొదలైన వాటిని పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అన్ని ఉద్యానవనాలలోనూ, పూలతోటలలోనూ ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగించాలన్నారు.భక్తులు దర్శనానంతరం సేదతీరేందుకు వీలుగా అన్ని ఉద్యానవనాల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలన్నారు. స్వామిఅమ్మవార్ల నిత్యకైంకర్యాలకు అధిక పరిమాణములో పూలు అవసరమవుతుంటాయని అభిప్రాయపడ్డారు. అందుకే సర్వతోభద్రవనం, మల్లమ్మవనం, భ్రామరీవనం, భ్రామరీవనం – 2, హాటకేశ్వరవనం, రుద్రాపార్కు మొదలైన పుష్పవనాలలో మరింతగా పూల మొక్కలు పెంచాలన్నారు.ఇప్పటికే వర్షాలు ప్రారంభమైన కారణంగా నందివర్థనం, గరుడవర్ధనం, గన్నేరు, గులాబి, కనకాంబరం, మందారం, సుగంధాలు (లిల్లీలు), దేవగన్నేరు మొదలైన మొక్కలను పెంచి పూలదిగుబడి పెంపుదలకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. అమ్మవారి అలంకరణకు నిమ్మకాయ దండలను వినియోగిస్తున్న కారణంగా ఉద్యానవనాలలో నిమ్మచెట్లను కూడా ఎక్కువగా పెంచాలన్నారు.ఉద్యానవనాలలో కొబ్బరి,మామిడి చెట్లను కూడా ఎక్కువగా పెంచాలన్నారు. పలుచోట్ల సుమారు 20 ఎకరాల విస్తీర్ణములో దేవస్థానం పూలతోటలను పెంచుతోంది.
కార్యనిర్వహణాధికారి దేవస్థానం టోల్ గేట్ వద్ద బసవవనాన్ని పరిశీలించారు. బసవవనంలో ఏర్పాటు చేసిన జారుడుబండ, ఊయల మొదలైన వాటి నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమత్తులు చేపట్టాలన్నారు. ఈ వనములో యాత్రీకులు, స్థానికులు ఉదయపు నడకను చేసేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం దేవస్థాన వసతిగృహాల సముదాయం వద్ద గల బాలగణేశవనాన్ని పరిశీలించారు.ఈ బాలగణేశవనములో ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్ ను మరింతగా విస్తరింపజేయాలన్నారు. ఈ వనములో మెట్టతామర, డాలియా లాంటి మొక్కలను విరివిగా పెంచాలన్నారు. ఈ వనములోనే చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన జారుడుబండ,ఊయల మొదలైన ప్లేయింగ్ ఎక్విప్మెంటకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తుండాలన్నారు.
కార్యనిర్వహణాధికారి మల్లమ్మవనాన్ని పరిశీలించారు. విశాలమైన ఈ వనములోని పూలమొక్కల రక్షణ కోసం తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. వనంచుట్టూ గల ఫెన్సింగ్ చుట్టూ అవసరమైన చోట్ల తగిన మరమ్మతులు చేయించాలన్నారు. వలయ రహదారిలో పర్యటిస్తూ రహదారికి ఇరువైపులా నీడనిచ్చే సుంకేసుల, వేప, కానుగ, రావి, మొదలైన చెట్లను నాటాలన్నారు. రహదారికి ఇరువైపులా ఫలాలనిచ్చే నేరేడు, మేడి చెట్లను కూడా నాటాలని సూచించారు. రాబోవు రెండు- మూడు వారాలలోగా వలయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి కావాలన్నారు. వలయ రహదారి విభాగినులలో (రోడ్డుడివైడర్స్) సుందరీకరణకు అనుగుణంగా మొక్కలను పెంచాలన్నారు. ఎక్కువగా కాగితపు పూలమొక్కలు ( భోగన్ విలియా), ఇతర ఆర్నమెంటల్ మొక్కలను నాటాలని సూచించారు. గోశాలను కూడా పరిశీలించారు. గోశాల ముందుభాగంలోనూ , ఆ పరిసరాలలో నీడనిచ్చే మొక్కలను విరివిగా పెంచాలన్నారు. దీనివలన గోసంరక్షణశాలలోని ఆవులు సేదతీరే అవకాశం ఉంటుందన్నారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, హార్టికల్చరిస్ట్ లోకేష్, సహాయస్థపతి ఐ. జవహర్, సంబంధిత సహాయ ఇంజనీర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.