శ్రీశైల దేవస్థానం:
• క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సత్రాల నిర్వాహకులు ఇతోధిక సేవలు అందించాలి
• వేసవి తీవ్రత కారణంగా అన్ని సత్రాలవారు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి
• సత్ర ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి
• శుచీశుభ్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
-కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు
ప్రభుత్వం శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉందని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు అన్నారు. ఇందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను దేవస్థానం దశలవారిగా కల్పించడం జరుగుతోందన్నారు. స్థానిక సత్రాల వారందరు కూడా క్షేత్రాభివృద్ధికి సహకరించాలన్నారు.
ఈ రోజు పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో స్థానిక సత్రాల వారితో కార్యనిర్వహణాధికారివారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అన్ని సత్రాలవారు కూడా సేవా దృక్ఫథంతో భక్తులకు సేవలను అందించాలన్నారు.అన్ని సత్రాలకు కూడా దేవస్థానం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు.
ఇంకా వారు మాట్లాడుతూ వేసవి తీవ్రత కారణంగా అన్నీ సత్రాల వారు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ చలివేంద్రాలలో మంచినీటితో పాటు మజ్జిగను కూడా ఉచితంగా భక్తులకు అందించాలన్నారు.
ప్రతీ సత్రం వారు కూడా శుచీశుభ్రతలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. సత్ర ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా సత్రాలు అన్నదానం కోసం ఆయా వంటకాలు వండేటప్పుడు, అన్నదానం చేసినప్పుడు కూడా శుచీశుభ్రత ఉండేవిధంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంటకాలలో తాజా కూరగాయలను వాడాలన్నారు. ఈ విషయమై సత్ర యజమాన్యాల వారు వారి సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ప్రకటించడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సత్రాలవారు కూడా సహకరించాలన్నారు. ఈ విషయమై సత్రాలలో వసతి పొందే భక్తులకు ఆయా సిబ్బంది తగు అవగాహన కల్పించాలన్నారు.
ముఖ్యంగా స్వచ్ఛ శ్రీశైలం పట్ల దేవస్థానం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. ఈ విషయమై సత్రాల వారు కూడా తగు శ్రద్ధ కనబర్చాలన్నారు. అన్ని సత్రాలలో కూడా తగినంత మేరకు చెత్తకుండీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
సత్రప్రాంగణాన్ని,పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు. అదేవిధంగా తడిచెత్తను, పొడిచెత్తను వేరువేరుగా ఉంచాలన్నారు. చెత్త సేకరణకై దేవస్థానం పారిశుద్ధ్య విభాగం వారు వచ్చినప్పుడు చెత్తను కూడా వేరు వేరుగా అనగా తడిచెత్త, పొడిచెత్తలుగా అందించాలన్నారు. అవకాశం మేరకు సత్రాలలో కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు, పారాయణలు, భజనలు, సత్సంగాలు మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.
అదేవిధంగా సత్రాలలో కూడా “ఓం నమ:శివాయ – శ్రీ మాత్రే నమ: ” నామ స్మరణ రికార్డింగును కూడా నిరంతరం ప్రసారం చేస్తుండాలన్నారు.
దేవదాయచట్టం 30 / 1987 అనుసరించి దేవస్థానం పరిధిలో క్షేత్రపరిధికి భంగం కలిగించే ఏ విధమైన కార్యక్రమాలు కూడా చేపట్టరాదన్నారు. కావున అన్నీ సత్రాల వారు మరియు ఇతర సంస్థల వారు సత్రాలలో ఎటువంటి నిషేధిత కార్యక్రమాలను అనుమతించకూడదన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి సి.హెచ్. శ్రీనివాసరెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, రెవెన్యూ విభాగపు పర్యవేక్షకులు యం. శ్రీనివాసరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
