శ్రీశైల దేవస్థానం:• నెలలో ఒకరోజు చెంచు గిరిజన భక్తులకు ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం
• ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు ప్రారంభమైన కార్యక్రమం
• దర్శనానంతరం చెంచు భక్తులకు అన్నప్రసాదాలను ఏర్పాటు చేసిన దేవస్థానం
• దేవస్థానం కల్పించిన అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేసిన చెంచు గిరిజనులు
ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం ఈ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ రోజు ఉదయం చెంచు గిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు వారికి ఆహ్వానం పలికారు.
తరువాత చెంచు భక్తులందరు కూడా ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణను చేశారు. అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి వారికి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, అమ్మవారి దర్శనాలను చేయించారు.
అనంతరం అన్నప్రసాద వితరణ భవనములో చెంచు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు. ధర్మకర్తలమండలి అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి కూడా చెంచు భక్తులతో అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
స్థానిక మేకలబండ గిరిజనులతో పాటు పలు ఇతర గూడెములకు చెందిన చెంచు భక్తులకు కూడా ఈ రోజు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు మాట్లాడుతూ తాము పదవీబాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచుగూడెములను సందర్శించానన్నారు. ఆ సందర్భంలో చెంచు భక్తులు తమకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించవలసినదిగా కోరడం జరిగిందన్నారు. తదనుగుణంగా ధర్మకర్తల మండలి సమావేశంలో చెంచుభక్తులకు నెలలో ఒకరోజున ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించాలని తీర్మానించడం జరిగిందన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో చెంచు భక్తులకు ఎంతో ప్రత్యేక స్థానము ఉందన్నారు.
తరువాత కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ చెంచు భక్తులు శ్రీ భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిడిగా భావిస్తారన్నారు. దేవస్థానంలో జరిగే ఆయా ఉత్సవాలలో గ్రామోత్సవం లో ప్రత్యేకంగా చెంచుల సంప్రదాయ నృత్యాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతోందన్నారు. ఇటీవల కార్తికమాసంలో జరిగిన కోటీ దీపోత్సవ కార్యక్రమంలో కూడా గిరిజన చెంచు మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు.
అనంతరం కార్యక్రమములో పాల్గొన్న స్థానిక మేకలబండకు చెందిన ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి జి. గంగమ్మ మాట్లాడుతూ ధర్మకర్తల మండలి , దేవస్థానం అధికారులు చెంచులకు కల్పించిన అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థానిక చెంచు భక్తుల పూర్వీకులందరు కూడా క్షేత్రానికి ఎన్నో సేవలు అందించారన్నారు.
ఈ సందర్భంగా పలువురు చెంచు భక్తులు తమకు కల్పించిన ఈ అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
• శ్రీశైలక్షేత్రంలో చెంచుగిరిజనులైన మాకు గల అనుబంధాన్ని గుర్తించి దేవస్థానం నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఉచిత దర్శనం కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలో చాలాసార్లు స్వామివారి అలంకార దర్శనాన్ని మాత్రమే చేసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రత్యేక అవకాశం కల్పించడం వల్ల శ్రీస్వామివారిని స్వయంగా ముట్టుకుని దర్శించుకోగలిగాం. ఈ అవకాశం కల్పించిన ధర్మకర్తల మండలికి , దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. – జి. మల్లయ్య, మేకలబండ
• శ్రీశైలదేవస్థానం ఈ రోజు చెంచులకు ఎంతో గౌరవప్రదంగా స్వామివారి స్పర్శదర్శనం కల్పించడం చాలా ఆనందంగా ఉంది. మా చెంచు గిరిజనులందరికీ ఇది ఎంతో మంచిరోజు – అంకాళమ్మ, మేకలబండ
• ధర్మకర్తల మండలి ,


దేవస్థానం అధికారులు మా చెంచుగిరిజనులకు ఎంతో మంచి అవకాశం కల్పించారు. స్వామివారిని ముట్టుకుని దర్శించుకునేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు మంచి అవకాశం లభించింది.



దేవస్థానం అధికారులు మా చెంచుగిరిజనులకు ఎంతో మంచి అవకాశం కల్పించారు. స్వామివారిని ముట్టుకుని దర్శించుకునేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు మంచి అవకాశం లభించింది. – చెవుల మల్లమ్మ, మేకలబండ
• మా చెంచులకు శ్రీశైలంతో ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఇప్పటికీ సంక్రాంతి ఉత్సవాలలో చెంచుల తరుపున మేము తేనె, వెదురుబియ్యం, అడవి ఆకులతో చేసిన బాసికాలు, వడ్డాణం సమర్పిస్తాం. దేవస్థానం ప్రతీనెలలో మాకు స్వామివారి స్పర్శదర్శనం కల్పించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది ఆ స్వామిఅమ్మవార్లు మాకు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాం
– పి. ఈదన్న, మేకలబండ
