శ్రీశైల దేవస్థానం:బుధవారం ఉదయానికి మార్గశిర శుద్ధ పౌర్ణమి ఘడియలు రావడంతో పాటు, గురువారం ఉదయం 8.11 గంటలవరకే పౌర్ణమి ఘడియలు ఉంటున్న కారణంగా 7వ తేదీ సాయంత్రం దేవస్థానం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించనుంది. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేయించి ప్రత్యేకపూజలు చేస్తారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది.
ఆలయ మహాద్వారం నుండి మొదలై ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, వలయ రహదారి మీదుగా ఫిల్టర్ బెడ్, సిద్ధిరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంటుంది. నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగుస్తుంది.
శ్రీశైలగిరిప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగం లో శ్రీరాముడు త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపురం మొదలైన ద్వారక్షేత్రాల గుండా గిరిప్రదక్షిణ ఆచరించినట్లు శ్రీశైలఖండం చెబుతోంది.శ్రీశైల క్షేత్రంలోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహిస్తారు.గిరిప్రదక్షిణంతరం భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు.