
*2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు*
తిరుమల, 2021 అక్టోబరు 13: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు వటపత్రశాయి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.
చంద్రప్రభ వాహనం – సకలతాపహరం
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, పోకల అశోక్ కుమార్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, విజివో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.