న్యూఢిల్లీ: గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంలో సీఎం చంద్రబాబు నాయుడు పాపం కూడా ఉందని విమర్శించారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం నినదించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి ఏపీకి చంద్రబాబు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏపీకి చేసిన అన్యాయానికి ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఎన్నికల వేళ చంద్రబాబు కొత్త పాట
బందుల వల్ల రాష్ట్ర అభివృద్ది ఆగిపోతుందని గతంలో చంద్రబాబు ప్రకటనలు చేశారని.. కానీ ఈ రోజు ఆయన బందుకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈవీఎంలు వద్దని చంద్రబాబు కొత్త పాట పాడుతున్నారని విమర్శించారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏ పార్టీ కూడా తిరిగి బ్యాలెట్లు కావాలని కోరలేదని, ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఏమైనా అనుమానాలు కలిగినప్పుడు మాత్రమే వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని కోరారని తెలిపారు. 2014లో చంద్రబాబు ఈవీఎంలపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తిరోగమనంలో ప్రయణిస్తున్నారని, అభివృద్దికి నిరోధకులుగా మారుతున్నారని విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లోని బ్యాంకుల్లో ఎంత బ్లాక్ మనీ ఉంది, స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు ఎంత ఉన్నాయో గుర్తించాలన్నారు. ప్రభుత్వ అంచనాలు కాకుండా, ప్రయివేట్ అంచనాల ప్రకారం ఈ బ్లాక్ మనీ రూ.70 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. బడ్జెట్ విషయంలో ఏపీకి ఏ ఒక్క రెఫరెన్స్ కూడా లేదన్నారు. ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే లేదన్నారు. ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రస్తావనే లేదన్నారు. విభజన చట్టంలోని హామీల ఊసే లేదన్నారు. గత నాలుగు బడ్జెట్లలో కూడా ఏపీకి ఎలాంటి ప్రయోజనం జరుగలేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నా అప్పట్లో కూడా రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగలేదన్నారు.