కమనీయం శ్రీపార్వతీ మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవం

 శ్రీశైల దేవస్థానం:సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా  మంగళవారం  రాత్రి  శ్రీపార్వతీ మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.

శ్రీశైలక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ , ప్రతిరోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కల్యాణోత్సవం , మకర సంక్రాంతి రోజున  శ్రీ పార్వతీ మల్లికార్జునస్వామివార్ల లీలాకల్యాణోత్సవం  విశేషం.

శ్రీస్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో ఎంతో వైభవంగా ఈ బ్రహ్మోత్సవ కల్యాణం జరిగింది.

కల్యాణోత్సవానికి ముందు అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠించారు. ఆదిదంపతులై, జగత్తుకంతా తల్లిదండ్రులైన శ్రీస్వామిఅమ్మవార్ల లీలా కల్యాణం వలన విశ్వశాంతి, లోక శ్రేయస్సుతో పాటు జనులందరికీ సకల శుభాలు కలగాలని ఈ సంకల్పంలో కోరారు.

సంకల్ప పఠనం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిగింది.

గణపతిపూజ తరువాత అభ్యుదయాన్ని, శుభాన్ని కాంక్షిస్తూ పుణ్యాహవచనం నిర్వహించారు. పుణ్యాహవచనం తరువాత శ్రీస్వామిఅమ్మవార్లు  వేంచేసిన సింహాసనానికి పూజాదికాలు చేశారు.

తరువాత కల్యాణోత్సవంలో భాగంగా కంకణాలకు (రక్షబంధాలకు) పూజాదికాలు చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ జరిగింది.

కంకణధారణ తరువాత స్వామివారికి యజ్ఞోపవీతధారణ చేశారు.

యజ్ఞోపవీతధారణ తరువాత అర్చకస్వాములు సప్తఋషుల ప్రార్థనను చేసి కన్యావరణ మంత్రాలను పఠించారు. పూర్వం శివపార్వతుల క ల్యాణ సమయములో స్వామివారికి తగిన వధువును వెదికే పనిని సప్తఋషులు నిర్వహించారు. అందుకు ప్రతీకగా ఆయా మంత్రాలతో ఏడుగురు అర్చక స్వాములు, వేదపండితులకు తాంబులాలు ఇస్తారు. దీనికే కన్యావరణం అని పేరు.కన్యావరణం తరువాత అమ్మవారికి కంకణధారణ జరిగింది.

అనంతరం స్వామివార్ల ప్రవర . తరువాత స్వామివారికి నూతన వస్త్రాన్ని సమర్పించి వరపూజ చేశారు. తరువాత అమ్మవారి ప్రవర కూడా పఠించారు.

అనంతరం స్వామివార్లనుదుట బాసికాన్ని అలంకరింపజేసారు. అమ్మవారికి కూడా బాసికధారణ చేశారు. బాసికధారణ తరువాత స్వామిఅమ్మవార్ల ఎదురుగా తెరవలే ఒక వస్త్రాన్ని కట్టారు. దీనినే తెరసెల్ల పట్టడం అంటారు. ఈ సమయంలో శ్రీశైల మహా సంకల్పం ప్రత్యేకం. శ్రీశైల సంకల్పంలో శ్రీశైలద్వార క్షేత్రాలు, ఉపద్వార క్షేత్రాలు, క్షేత్రంలోని వనాలు, తీర్థాలు, గుండాలు మొదలైన అంశాలు ప్రస్తావిం చేశారు 

మహాసంకల్పం తరువాత లగ్నాపకాలుగా పిలువబడే మంగళకరమై ఎనిమిది శ్లోకాలు పఠించారు

అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు.

ఈ సమర్పణ తరువాత మాంగల్యపూజ జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ జరిగింది. మాంగల్యధారణ తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిపారు.

అనంతరం స్వామివారి ఉత్తరీయానికి, అమ్మవారికొంగుతో బ్రహ్మముడివేసి స్వామిఅమ్మవార్లకు పునఃపూజ నిర్వహించారు.

చివరగా భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు.

చెంచు భక్తులకు ప్రత్యేక ఆహ్వానం;

సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేకంగా చెంచు భక్తులను ఆహ్వానించారు. స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఏ) అధికారుల సహకారంతో చెంచుభక్తులు కల్యాణోత్సవానికి విచ్చేసే ఏర్పాట్లు చేశారు

ఈ రోజు  సాయంత్రం కల్యాణానికి విచ్చేసిన గిరిజన చెంచు భక్తులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సంప్రదాయ బద్దంగా ఆహ్వానం పలికారు.

చెంచు భక్తుల వెంట ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు ఆఫీసర్  కె.వి. శివప్రసాద్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసరు ఎ. సురేష్ కుమార్, పలువురు ఐ.టి.డి.ఎ. సిబ్బంది కూడా ఉన్నారు.

శ్రీశైల మహాక్షేత్రంలో గాఢమైన సంబంధం గల చెంచు భక్తుల సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి కల్యాణోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

కాగా చెంచులు శ్రీశైల భ్రమరాంబను తమ కూతురిగా శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. అదే విధంగా స్వామివారిని చెంచుమల్లన్న, చెంచుమల్లయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

*

కల్యాణోత్సవానికి విచ్చేసిన చెంచు భక్తులకు దేవస్థానం తరుపున వస్త్రాల (పురుషులకు పంచ, కండువా, మహిళలకు చీర, రవికవస్త్రం) కూడా ఇచ్చారు..

కాగా ఈ కల్యాణోత్సవంలో చెంచు గిరిజనులు నూతన వస్త్రాలతో పాటు అడవి ఆకులతో అల్లిన అభరణాలను, శ్రీస్వామిఅమ్మవార్లకు సంప్రదాయబద్దంగా సమర్పించారు.

ఈ సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ఈతఆకులతో అల్లిన కంకణాలు, బాసికాలు, స్వామివారికి యజ్ఞోపవీతం, అమ్మవారికి వడ్డాణం, మెట్టెలు, ఇంకా మెడలో అలంకరించేందుకు ఆకులతో అల్లిన హారాలను కూడా  సమర్పించారు..

కల్యాణస మయములో చెంచు భక్తులు సమర్పించిన వీటిని శ్రీస్వామిఅమ్మవార్లకు అలంకరింపజేసారు.

అర్థవీడు, యాచవరం, చెంచుకాలనీ, దోర్నాల ఎస్టి కాలనీ, బందం బావి, మేకలబండ, మాణిక్యసెల మొదలైన పలుగూడెముల నుండి భక్తులు కల్యాణోత్సవానికి విచ్చేసారు. కల్యాణోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులు, స్థానాచార్యులు ( అధ్యాపక) అర్చకస్వాములు, వేదపండితులు, ఆలయ విభాగ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు ఆఫీసర్  కె.వి. శివప్రసాద్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసరు ఎ. సురేష్ కుమార్, పలువురు ఐ.టి.డి.ఎ. సిబ్బంది కూడా పాల్గొన్నారు..

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.