
*మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి
*భక్తులకు చిన్న ఇబ్బందులు కూడ కలుగకూడదు
*అధికారులను ఆదేశించిన జిల్లా
శ్రీశైలం/నంద్యాల, జనవరి 22:-మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడ తలెత్తకుండా శ్రీస్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పి యుగంధర్ బాబు, శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ మహమ్మద్ అన్షర్ ఆలీ, సబ్కలెక్టర్ సాదిక్ త్రివినాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు సమన్వయముతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. శాఖల వారిగా సమీక్షిస్తూ, అవసరమైన ప్రతిపాదనలను సమర్పిస్తే దేవస్థానం కార్యనిర్వహణాధికారిని సమన్వయం చేసి సంబంధిత ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు చేసే ఏర్పాట్లపై 200 శాతం పకడ్బంది ప్రణాళికలు రూపొందిస్తే 100 శాతం అమలులోకి వస్తాయన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్, రవాణా, భక్తులకు శీఘ్రదర్శనం తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా వెంటనే స్పందించి ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు. లక్షల మంది పాదయాత్ర భక్తులు వచ్చే మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు.
భీముని కొలను, కైలాసద్వారం ప్రాంతాల్లో ప్రమాద బాధితులకు స్ట్రేచ్చర్లు, అంబులెన్సులను కూడా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డిఎంఅండ్ హెచ్ఓను ఆదేశించారు కలెక్టర్. క్యూలైన్లలో స్వామిఅమ్మవార్ల దర్శనార్థమై వేచివుండే భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారికి సూచించారు. తెలంగాణా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 800 బస్సులు వచ్చే అవకాశం వుందని ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్ట ప్రణాళికలతో పార్కింగ్ చేసుకుని తిరిగి వెళ్ళేందుకు సూచిక బోర్డులతో పాటు తగు సూచనలను జారీ చేయాలన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా సమాచారం నిమిత్తం హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి తగు సమాచారాన్ని భక్తులకు తెలపాలన్నారు. శ్రీశైలక్షేత్ర పరిధిలో శానిటేషన్ సిబ్బందితో చెత్తా చెదారం, మురికికాల్వలు శుభ్రం తదితర పారిశుద్ధ్య పనులను 24 గంటల పాటు మూడు షిఫ్టులలో పనిచేసేలా చర్యలు తీసుకుకోవాలని డీపిఓ ను ఆదేశించారు. అటవీశాఖ పరిధిలో ఉన్న చెక్పోస్టులలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు ఎలాంటి రుసుం తీసుకోకుండా వాహనాలను అనుమతించాలని ఫారెస్ట్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని ప్రాంతాలలో దోమల నియంత్రణకు ఫాగింగ్ మిషన్లు వినియోగించాలని మలేరియా అధికారులను సూచించారు. హోటళ్ళలో విక్రయించే తినుబండరాలను శ్యాంపిల్స్ ను సేకరించి తనిఖీ చేయడంతో పాటు ధరల సూచికల బోర్డులను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజి అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు అమలు చేయడంతో పాటు అవసరమైన జనరేటర్లను సమకూర్చాలని ఎపీఎస్పి డీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయముతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు వుంటే సరిచేసుకోవాలని సూచించారు. ఫారెస్ట్, పోలీసు అధికారులు సహకరించి సాక్షి గణపతి సమీపంలో ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అన్ని శాఖలు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని అధికారులను సూచించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శ్రీశైలంలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై పిపిటి ద్వారా వివరించారు. అడిషనల్ ఎస్పి యుగంధర్ బాబు మాట్లాడుతూ క్యూ లైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దాదాపు 3 వేల పోలీసు సిబ్బందితో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.