
శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (14.11.2021)న కార్తిక రెండవ ఆదివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్నారు.ఈ రోజు వేకువజాము నుండే భక్తులు దర్శనాలకు రావడం మొదలైంది.
దర్శనం ఏర్పాట్లు:
భక్తుల రద్దీని, కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని శ్రీస్వామిఅమ్మవార్ల లఘుదర్శనానికి (అలంకార దర్శనానికి) మాత్రమే అవకాశం కల్పించారు.
వేకువజామున గం.3.30లకు ఆలయ ద్వారాలు తెరచి ఉదయం గం.5.00ల నుంచి మధ్యాహ్నం 3.00గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయశుద్ధి, ప్రదోషకాల పూజల అనంతరం తిరిగి సాయంకాలం గం.5.30 గంటల నుంచి దర్శనాలు ప్రత్యేకం. రాత్రి గం.10.00ల వరకు దర్శనాలకు ఏర్పాట్లు చేసారు.
ఆది, సోమవారాలలో శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శదర్శనం నిలిపివేత:
కార్తికమాసంలోని ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజులు, శుద్ధ మరియు బహుళ ఏకాదశి రోజులలో మాత్రం రద్దీ కారణంగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం మరియు గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేసారు. మిగతా రోజులలో స్వామివార్ల స్పర్శదర్శనం గర్భాలయ అభిషేకాలను నిర్వహిస్తారు.
| సిబ్బందికి ప్రత్యేక విధులు |
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారు.
కార్యనిర్వహణాధికారి ఎప్పటికప్పుడు దర్శనం క్యూలైన్లను, ఆర్జితసేవ క్యూలైన్లను ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కార్తికదీపోత్సవం:
భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఉత్తర శివవీధి (ఉత్తరమాడవీధి)లో మరియు శ్రీ కృష్ణదేవరాయ గోపురము ఎదురుగా గల గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
ఈ రోజు ఉదయం నుండే భక్తులు కార్తికదీపారాధనలను చేయడం ప్రారంభమైంది. అదే విధముగా కొందరు భక్తులు లక్షవత్తుల నోములను కూడా నోచుకున్నారు.
వేడిపాల వితరణ;
ఈ రోజు ఉదయం క్యూలైన్లలోని భక్తులకు వేడిపాలను అందించారు.
క్యూలైన్లలో అల్పాహారం క్యూకాంప్లెక్స్లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు మరియు మంచినీరు అందించారు.
ఉచిత ప్రసాద వితరణ:
ఈ రోజు వేకువజామున దర్శనాలు ప్రారంభమైనప్పటి నుండే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేసారు. రాత్రివేళ సర్వదర్శనం ముగిసేంతవరకు భక్తులకు ఈ ఉచిత ప్రసాద వితరణ చేస్తారు.
అన్నప్రసాద వితరణ కార్తికమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థమై ప్రతిరోజు కూడా అన్నదానమందిరంలో ఉదయం 10.30గంటల నుండి మధ్యాహ్నం 3.30గంటల వరకు కూడా భక్తులకు అన్నప్రసాదాలు ఇస్తున్నారు.
లడ్డు ప్రసాదాలు:
కార్తికమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేసారు. మొత్తం 9 కౌంటర్ల ద్వారా ఈ లడ్డు ప్రసాదాలు విక్రయిస్తున్నారు.