
శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం త్రయోదశిని పురస్కరించుకొని దేవస్థానం ఈ రోజు (18.09.2021)న ఆలయప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించింది.
ప్రతి మంగళవారం , త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం ఉంటుంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహిస్తారు.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజికవర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పారు.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షాదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో ఈ విశేషాభిషేకాన్ని జరిపారు . తరువాత నందీశ్వరస్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు.
చివరగా స్వామికి నివేదన సమర్పించారు.