శ్రీశైల దేవస్థానం:ఆషాఢపౌర్ణమి సందర్భంగా ఈ రోజు (24.07.2021) న శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం ఘనంగా జరిగింది . ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో శ్రీభ్రమరాంబాదేవివారిమూలమూర్తిని, ఉత్సవమూర్తిని,ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి, గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి శాకాలంకరణ, ఉత్సవసంబంధి పూజాదికాలు చేసారు.ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయప్రాంగణాన్ని పలురకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు.ఇందుకోసం అవసరమైన వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలను తెప్పించారు.
దేవస్థానం సూచనల మేరకు పలువురు దాతలు వీటిని విరాళంగా సమర్పించారు.
వంగ,బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి బంగాళదుంప, కందదుంప, క్యాప్పికమ్ (బెంగుళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి మొదలైన వివిధ రకాల కూరగాయలు, తోటకూర,పాలకూర, మెంతికూర, చుక్కకూర, మొదలైన పలురకాల ఆకుకూరలు, పుదీన, కరివేపాకు, కొత్తిమీర లాంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ఆపిల్, అరటి, పనస మొదలైన పలురకాల ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు మరియు పచ్చిశనగలు మొదలైన వాటిని ఈ ఉత్సవానికి తెప్పించారు.
కాగా ఈ ఉత్సవంలో భాగంగా ఆగమశాస్త్రానుసారంగా శ్రీభ్రమరాంబాదేవి వారికి ఉత్సవ సంబంధి పూజాదికాలు చేసారు.
కార్యక్రమములో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు.
సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారంచబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, జనులందరు సుఖసంతోషాలతో ఉండాలని ఈ సంకల్పం లో చెప్పారు.అదేవిధంగా జనులందరూ ఆరోగ్యంగా వుండాలని, మానవులకు హానిచేసే సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా నిరోధించబడాలని కూడా కోరారు.
తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిగింది.
ఉత్సవంలో భాగంగానే శాకంభరీగా అలంకరించబడిన అమ్మవారి ఉత్సవమూర్తికి కూడా విశేషంగా షోడశోపచారపూజలు జరిగాయి.
కాగా పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్జానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.
ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన అమ్మవారి స్వరూపమే శాకంభరీదేవి.
కాగా ఆషాఢ పౌర్ణమిరోజున అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పాడిపంటలు బాగాపండుతాయని, కరువుకాటకాలు నివారించబడుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఎంతో శాస్తోక్తంగా అమ్మవారికి ఈ కైంకర్యాన్ని చేస్తున్నారు.
