(హైదరాబాద్ – జూన్ 27 ) రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆదేశించారు. ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టులకు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్ -ఐఐసీ) 16వ బోర్డు(పాలకవర్గ) సమావేశం బుధవారం చైర్మన్ గ్యాదరి బాలమల్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ నదీమ్ అహ్మద్, టీఎస్ ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈ వెంకట నర్సింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న పారిశ్రామికవాడలు, ఇతర ఐటీ ప్రాజెక్టుల పురోగతిపై టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు సమీక్షించారు.