శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం మంగళవారం ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించింది.
ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు.
కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని నమ్మకం.
ఈ అభిషేకానికి ముందుగా, దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
తరువాత , కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపారు. అనంతరం శ్రీసుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, అర్చన తరువాత సుబ్రహ్మణ్యస్తోత్ర పారాయణలు చేసారు.
సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు,పెరుగు,తేనె,నెయ్యి, కొబ్బరి నీళ్ళు , వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వివిధ పండ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.
