
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవాగమ పాఠశాలలో ప్రవేశం పొంది, మొత్తం 6 సంవత్సరాల వీరశైవాగమ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులను అభినందించేందుకుగాను మంగళవారం సమావేశం నిర్వహించారు.
2018 -19 విద్యా సంవత్సరంలో ప్రవేశాన్ని పొందిన మొత్తం 25 మంది విద్యార్థులు దేవస్థానం పాఠశాలలో ప్రవేశ, వర, ప్రవర కోర్సులను పూర్తి చేశారు . ఈ సందర్భంగానే ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఈ అభినందన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆగమ విద్య ఎంతో గొప్పదైన విద్య అని అన్నారు. ఆగమ విద్యను నియమనిష్ఠలతో అభ్యసించవలసి ఉంటుందన్నారు.దేవస్థానం పాఠశాలలో ఆరు సంవత్సరాల వీరశైవాగమ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులందరికీ శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కృపా కటాక్షాలతో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.
విద్యార్థులందరూ ఆగమ విద్యను మరింతగా సాధన చేస్తూ, మరింత మందికి ఆగమ విద్యను నేర్పి, తాము విద్యనభ్యసించిన దేవస్థానం పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు ఈ ఓ. విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులందరూ కూడా నిరంతర పఠనంతో సంస్కృతం, జ్యోతిషం, వాస్తు మొదలైన అంశాలపై మరింత అవగాహనను పెంచుకోవాలన్నారు.విద్యార్థులందరు అర్చక వృత్తిని స్వీకరించిన తరువాత ఆయా ఆలయాలలో త్రికరణశుద్ధిగా పూజాదికాలు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా ఆయా ఆలయాలను సందర్శించే భక్తులకు సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు.
దేవస్థానం ఆగమ పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు ఈ ఓ. ఇప్పటికే తాను స్వయంగా అన్నవరం దేవస్థానం, కాంచీపురంలోని కంచిమఠ పాఠశాలలను పరిశీలించడం జరిగిందన్నారు.తరువాత విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులందరికీ శ్రీస్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.కార్యక్రమములో స్వామివారి ఆలయ ఉపప్రధానార్చకులు మరియు ఆగమ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ మఠం శివశంకరయ్యస్వామి, పర్యవేక్షకులు డి. నాగేశ్వరరావు, పాఠశాల ఆంగ్ల అధ్యాపకులు డి. లక్ష్మీనారాయణ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.