
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి 8.00గం.లకు శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు.
ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు చేశారు. తరువాత ఉత్సవమూర్తులను ఆలయరాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా తోడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేష పూజాదికాలను జరిపారు.తరువాత మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం ప్రత్యేకం.
వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో ఈ తెప్ప ఎంతో కళాత్మకంగా రూపొందింది.
తెప్ప అలంకరణకుగాను ఎరుపుబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, గులాబీలు, కనకాంబరం, ఆస్టర్, జబ్రా, గ్లాడియోలస్, ఆర్కిడ్స్, మొదలైన పుష్పాలను వినియోగించారు.
తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి.
ఘనంగా రథోత్సవం:
అం తకుముందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదో రోజు గురువారం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు.అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి.
ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
ఈ రోజు సాయంకాలం స్వామిఅమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించారు. రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి కార్యక్రమాలు జరిపారు. రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నంరాశి) సాత్వికబలిగా సమర్పించారు. . తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను రథం పైకి వేంచేబు చేయించి రథోత్సవం ఘనంగా జరిపారు.
ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
రథోత్సవాన్ని పురస్కరించుకొని బంతి, చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు, చాందిని, గ్లాడియోలస్, కార్నియా, ఆస్టర్స్, మొదలైన 11 రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించారు. ఈ ఓ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల:
*విధుల్లో అందరి కృషి అభినందనీయం…
*నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని, విధుల్లో అందరి కృషి అభినందనీయమని నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ అన్నారు. రథోత్సవం కన్నుల పండుగగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముఖ్యమైన శైవ క్షేత్రాలతో పాటు, శ్రీశైలం బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అందరూ సమన్వయంతో భక్తుల భద్రత, క్షేమమే లక్ష్యంగా బాగా పని చేసి విజయవంతంగా పూర్తి చేశారన్నారు.బందోబస్తు విధుల్లో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.హోంగార్డు స్ధాయి నుండి అడిషనల్ ఎస్పీ స్ధాయి వరకు ప్రతి ఒక్కరూ నిర్విరామంగా కృషి చేశారన్నారు.