
శ్రీశైలదేవస్థానం:గంగాభవాని స్నానఘట్టాల పరిశీలన జరిగింది . మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 04.03.2021 నుండి 14.03.2021 వరకు 11 రోజులపాటు జరుగనున్న సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లను చేస్తున్నారు.ఇందులో భాగంగా ఈ రోజు (14.02.2021) న కార్యనిర్వహణాధికారి కే. ఎస్.రామ రావు గంగాభవాని స్నానఘట్టాలు, శివదీక్షా శిబిరాలు మొదలైనవాటి వద్ద చేయవలసిన పనులను పరిశీలించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పలవురు భక్తులు ముఖ్యంగా శివదీక్ష భక్తులు ఈ స్నానఘట్టాలలో స్నానాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా, స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని కార్యనిర్వహణాధికారి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా గంగాభవాని స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.స్నానఘట్టాలలోని అన్ని కుళాయిలకు మరమ్మతులు చేసి, అన్ని కుళాయిల ద్వారా కూడా నీరు వచ్చే ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న కుళాయిలతో పాటు గంగాభవాని వద్ద ప్రత్యేకంగా మరో నీటి సరఫరా పైపును ఏర్పాటు చేసి మరిన్ని కుళాయిలను కూడా ఏర్పాటు చేయాలని నీటి సరఫరా విభాగాన్ని ఆదేశించారు. ఈ ప్రత్యేక లైను నీటిసరఫరాకు గాను స్నానఘట్టాల వద్ద అధికనీటి సామర్థ్యం గల సింటెక్స్ ట్యాంకును ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవాల సమయములో నిరంతరంగా ఈ సింటెక్స్ ట్యాంకుకు నీటి సరఫరా ఉండేటట్లుగా చర్యలు చేపట్టాలన్నారు. దీనివలన ఒకే సమయంలో ఎక్కువ మంది భక్తులు స్నానాలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. గంగాభవానిలో మహిళలు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించిన స్నానాల గదికి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయాలన్నారు. స్నానఘట్టాల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే గదికి కూడా అవసరమైన మరమ్మతులు చేయించాలన్నారు.
ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసిఎప్పటికప్పుడు స్నానఘట్టాలను, పరిసరాలను శుభ్రపరుస్తుండాలని కే. ఎస్.రామ రావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఈ స్నానఘట్టాల ప్రాంగణంలో అవకాశం మేరకు పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ముఖ్యంగా పూలమొక్కలు, సుందరీకరణ మొక్కలను నాటాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. దీని వలన స్నానఘట్టాల పరిసరాలు ఆహ్లాదకరంగా వుంటాయన్నారు. స్నానఘట్టాల ప్రాంగణంలో శివరూపాలు మొదలైన వాటి పెయింటింగ్స్ ను చిత్రీకరింపజేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కూడా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
స్నానఘట్టాల పరిసరాలలో శివమహిమలను, శ్రీశైలక్షేత్ర మాహాత్మ్యాన్ని తెలిపే అంశాలను రాయించాలని కే. ఎస్.రామ రావు శ్రీశైలప్రభ సంపాదకుణ్ని ఆదేశించారు. దీనివలన స్నానఘట్టాల పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు.అదేవిధంగా స్నానఘట్టాల వద్ద గతములో ఏర్పాటు చేసిన ఫౌంటేన్ కూడా తగు మరమ్మతులు చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు.బ్రహ్మోత్సవాల సమయానికంతా గంగాభవాని స్నానఘట్టాల ప్రాంగణమంతా కూడా అవసరమైన మేరకు తాత్కాలిక విద్యుద్దీకరణ పనులు చేపట్టాలన్నారు.ఈ నెలాఖరుకంతా స్నానఘట్టాల పరిసరాలకు సున్నాలను వేయించాలని కూడా ఆదేశించారు.
కార్యనిర్వహణాధికారి కే. ఎస్.రామ రావు శివదీక్షా శిబిరాలను పరిశీలించారు. శివదీక్షా శిబిరాలలో భక్తులు సులభతరంగా జ్యోతిర్ముడిని సమర్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా శిబిరాల వద్ద గత సంవత్సరముకంటే మరింత విస్తీర్ణంతో క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. శివదీక్షా శిబిర ప్రాంగణమంతా కూడా చలువపందిర్లు (పైప్ పెండాల్స్) వేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.గతంలో మాదిరిగానే శివదీక్షా శిబిరాల వద్ద దీక్షాభక్తులు స్నానాదికాలు చేసేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అక్కడ గల శౌచలయాలకు కూడా అవసరమైన మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పారిశుద్ధ్య విభాగపు పర్యవేక్షకులు వెంకటేశ్వరరావు, ఉద్యానవన అధికారి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.