
*ఏడాదిన్నరలో చెన్నైలో అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం :
తిరుమల 13 ఫిబ్రవరి 2021: ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా త్వరలో కళ్యాణమస్తు కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం చెన్నైలో శంకు స్థాపన చేసిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ఏడాదిన్నరలో పూర్తి చేయడం లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.చెన్నై జిఎన్ చెట్టి వీధిలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శనివారం నిర్వహించిన శంకు స్థాపన, తమిళనాడు లో గుడికో గోమాత ప్రారంభ కార్యక్రమాల్లో చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.పేద కుటుంబాలు పెళ్ళి ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఇలాంటి వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వివాహాలు జరిపించడానికి టీటీడీ దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో కళ్యాణమస్తు ( సామూహిక వివాహాలు) నిర్వహించనుందన్నారు. మంచి ముహూర్తం నిర్ణయించి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. వివాహాలు చేసుకునే జంటకు పట్టు వస్త్రాలు, మంగళ సూత్రాలు ఇవ్వడంతో పాటు వివాహ విందు భోజనం కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు.
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసంలో ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో అమలు జరుగుతోందన్నారు. శనివారం కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా తమిళనాడు లో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 8 ఆలయాలకు గోవు, దూడ అందించామన్నారు. వీటి పోషణ ఆ ఆలయాలే చూసుకోవాలన్నారు.దేశ వ్యాప్తంగా ఆలయాలు, వేద పాఠశాలలు, మఠాలు, పీఠాలు ముందుకొస్తే గోవు, దూడ అందిస్తామని చైర్మన్ చెప్పారు. చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం గత ఏడాదిలోనే జరగాల్సి ఉందని, కోవిడ్ వల్ల ఆలస్యం అయ్యిందన్నారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 6. 85 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారన్నారు. ఇందులో టీటీడీ రూ. 5.85 కోట్లు భరిస్తుందన్నారు, చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.కోటి విరాళం అందిస్తారని చైర్మన్ చెప్పారు. సినీనటి కుమారి కాంచనతో పాటు వారి కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చిన భూమి విలువ రూ.40 కోట్ల దాకా ఉంటుందని ఆయన వివరించారు. వీరి కుటుంబానికి శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి దేవి ఆశీస్సులు లభించాలని ఆయన ప్రార్థించారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ, ఏడాదిన్నరలోగా పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జమ్మూ, ముంబై లో శ్రీవారి ఆలయాలు నిర్మించబోతున్నామన్నారు. కన్యాకుమారి లోని శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. చెన్నైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం ఈసిఆర్ రోడ్, ఓఎంఆర్ రోడ్ లో 10 ఎకరాల భూమి కేటాయించడానికి అంగీకరించిందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు రెండు చోట్ల భూమి పరిశీలించి ఆలయ నిర్మాణానికి ఏది అనుకూలమో నిర్ణయించాక ఇతర ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
మీడియా సమావేశంలో చైర్మన్ తో పాటు టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు, చెన్నై సలహామండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
చెన్నైలో శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకు స్థాపన
– తమిళనాడు లో గుడికో గోమాత ప్రారంభం
– పద్మావతి అమ్మవారు దేశంలో పేదరికం పొగొట్టాలి : కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి
తిరుమల, 13 ఫిబ్రవరి 2021: చెన్నై మహానగరం లోని జి ఎన్ చెట్టి స్ట్రీట్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శనివారం ఉదయం శాస్త్రోక్తంగా శంకు స్థాపన నిర్వహించారు. వేద పండితులు, అర్చకుల వేదమన్త్రోచ్చరణ మధ్య కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
టి. నగర్ లోని జి ఎన్ చెట్టి వీధిలో సినీనటి కాంచన, శ్రీమతి వి గిరిజా పాండే, కెపి పాండే, .పి.రవిభూషణ శర్మ రూ. 40 కోట్ల విలువ చేసే 34 సెంట్ల ( 6 గ్రౌండ్లు) భూమి టీటీడీకి దానంగా ఇచ్చారు. దాతల కోరిక మేరకు టీటీడీ ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 10 వ తేదీ విష్వక్సేన ఆ రాధన, అంకురార్పణ నిర్వహించారు. 11, 12వ తేదీల్లో పంచసూక్త హోమం జరిపారు. శనివారం ఉదయం శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆలయ నిర్మాణానికి వేద మంత్రాల నడుమ నవధాన్యాలు వేసి శంకు స్థాపన చేశారు. అనంతరం పంచసూక్త హోమం పూర్ణాహుతిలో పాల్గొని, ఆలయ శంకు స్థాపనకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు.
అంతకుముందు కంచి పీఠాధిపతి ఇదే ప్రాంగణంలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని తమిళనాడులో ప్రారంభించారు. 8 గోవులు, 8 దూడలకు పూజలు చేసి, నూతన వస్త్ర ధారణ, హారతులు ఇచ్చి తమిళనాడు లోని 8 ఆలయాలకు గోవు, దూడలను అందించారు.
టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు, టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు, స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి దంపతులు, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, డాక్టర్ ముప్పవరపు నిశ్చిత, కుమారగురు, గోవిందహరి, భూమి దాతలు కాంచన శ్రీమతి వి.గిరిజా పాండే, కె పి పాండే ,. టీటీడీ సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, ఎస్ఈ లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు తో పాటు స్థానిక సలహామండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పేదరిక నిర్మూలన జరిగి, దేశానికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి : శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి
అమ్మవారి కృపతో దేశంలో పేదరికం తొలగిపోయి,అందరికీ ఉపాధి లభించి, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకు స్థాపన అనంతరం ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భూదానం, గోదానం, స్వర్ణ దానం వల్ల ఏడు జన్మల పుణ్యం లభిస్తుందన్నారు. చెన్నై మహానగరంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ద్వారా హిందూ ధర్మ ప్రచారం మరింతగా విస్తరిస్తుందని స్వామి చెప్పారు.టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం బాగా జరుగుతోందని, గుడికో గోమాత లాంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.