శ్రీశైల దేవస్థానం:ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు.
ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథోత్సవం జరిపారు.
స్వర్ణ రథోత్సవంలో ముందుగా, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు.
అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7.00లకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని నిర్వహించారు.
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. రథోత్సవంలో సంప్రదాయ నృత్యంఏర్పాటు చేశారు.
స్వర్ణ రథోత్సవంలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.రమణ, శ్రీమతి జి. గంగమ్మ, డి. వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి, అర్చకస్వాములు, పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. 





















