
శ్రీశైల దేవస్థానం:
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు
- త్రాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు
- క్షేత్రపరిధిలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు
వర్షాలతో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ఆదేశించారు.
మంగళవారం ఉదయం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కార్యనిర్వహణాధికారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ వర్షాల తో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్తలన్నింటిని తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా చెత్తాచెదారాలు ఉండకుండా విస్తృత పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. క్షేత్రపరిధిలో ఎక్కడ కూడా వర్షం నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా దోమలు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
ముఖ్యంగా శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా నీటిని క్లోరినేషన్ చేస్తుండాలన్నారు. ముఖ్యంగా మంచినీరు కలుషితం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర పరిధిలోని మంచినీటి ట్యాంకులన్నింటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. మంచినీటి ట్రీట్మెంట్ ప్లాంట్ లో ప్రతీరోజు కూడా టి.డి.ఎస్. తనిఖీ చేయాలన్నారు.
దేవస్థానం వైద్యశాలలో అవసరమైన అన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అవసరాన్నిబట్టి ఆయా మందుల ఇండెంటులను ముందస్తుగానే వైద్యశాల విభాగాధికారికి అందజేయాలని దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో డాక్టర్ల ఆదేశించారు.
అదేవిధంగా వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత, మరిగించి చల్లార్చిన నీటిని త్రాగడం, ఇళ్ళలోనూ, ఇంటి పరిసరాలను నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త పడడంలాంటి అంశాలపై స్థానికులలో అవగాహన కలిగించాలని దేవస్థాన డాక్టర్లను , ప్రాథమిక ఆరోగ్య వైద్యులను సూచించారు. ఈ విషయమై దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా (మైకు ద్వారా) కూడా స్థానికులలో అవగాహన కల్పించనున్నారు.
ఈ విషయమై జనులలో అవగాహన కలిగేందుకు క్షేత్రపరిధిలో ప్రధానకూడళ్ళు , ఇతర ప్రదేశాలలో తగు బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ఈ విషయమై కరపత్రముల ద్వారా కూడా ప్రచారం కల్పించాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
దేవస్థాన అన్ని విభాగాలు, దేవస్థానం వైద్యశాల సిబ్బంది, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అందరు కూడా సమన్వయంతో విధులు నిర్వర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సమాచార వినిమయం కోసం దేవస్థానం సంబంధిత విభాగాల అధికారులు, దేవస్థానం వైద్యశాల వైద్యులు , సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, స్థానిక ఆయుర్వేద వైద్యాధికారి మరియు సిబ్బందికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఐ.టి. విభాగాన్ని ఆదేశించారు. విధినిర్వహణలో పరస్పర సమన్వయం కోసం ఈ వాట్సాప్ గ్రూపును వినియోగించుకోవచ్చునని అన్నారు.
సమావేశంలో దేవస్థానం డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీ యం. నరసింహారెడ్డి, అన్ని విభాగాల సహాయ కార్యనిర్వహణాధికారులు, ప్రజాసంబంధాల అధికారి, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ సంబంధిత విభాగాల పర్యవేక్షకులు, దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు డా. పవన్ కుమార్ రెడ్డి, డా. అనురాగ్రెడ్డి, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. శ్రీవాణి, స్థానిక ఆయుర్వేద వైద్యులు డా. స్వరూప సంబంధింత దేవస్థానం సిబ్బంది, ప్రాధమిక ఆర్యోగ్య సిబ్బంది పాల్గొన్నారు.