
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిదో రోజు ఆదివారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
తరువాత యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.
అదే విధముగా ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి
రావణ వాహనసేవ:
శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు.
గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశారు.
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
➖ శ్రీశైల క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో కలిసి ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
➖ ఈ పవిత్ర సందర్భంలో మంత్రి , ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల మంగళకాంక్షల మధ్య స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
➖ ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ : “శ్రీశైలం దేవస్థానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది అని తెలిపారు.రోజు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త లు తీసుకున్నాము. భక్తులు స్వామి వారిని ప్రశాంతం గా దర్శించుకునేదుకు అన్ని ఏర్పాట్లు చేశాము అని తెలిపారు.
➖ ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ అజాద్ ఆలయ ఈవో శ్రీనివాసరావు , అర్చకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
శ్రీశైలం/నంద్యాల 23:-
సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పరిశీలించారు. ఆదివారం శ్రీశైలంలోని హఠకేశ్వరం, కైలాస ద్వారం, కమాండ్ కంట్రోల్ రూమ్, పారిశుద్ధ్యం, 30 పడకల ఆసుపత్రి, మెడికల్ వైద్య శిబిరాలు, తదితర ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హఠకేశ్వరం, కైలాస ద్వారం సమీపాలలో పాదయాత్ర ద్వారా వస్తున్న భక్తులను పరామర్శిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నడక దారిలో మెడికల్ క్యాంపులు ఎలా నడుస్తున్నాయి, ఉచితంగా భోజనాలు అందిస్తున్నారా, త్రాగునీటి సదుపాయం ఎలా ఉన్నాయనే విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. నడక దారిలో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా, పారిశుద్ధ్యం ఎలా ఉంది, కల్పించిన సౌకర్యాలపై ఆరా తీస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీశైల దేవస్థాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలిస్తూ కంట్రోల్ రూమ్ ఎలా పనిచేస్తుంది, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఎలా కోఆర్డినేట్ చేసుకొని సమస్యను పరిష్కరిస్తున్నారు తదితర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి 30 పడకల ఆసుపత్రిని పరిశీలించి నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో చేరిన పేషంట్లను పరామర్శిస్తూ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతూ ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 11 జోన్లుగా విభజించిన శ్రీశైల క్షేత్రం అంతటా పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.