
శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా సోమవారం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు బాహ్యవలయరహదారి ( ఔటర్ రింగురోడ్డు) పరిసర ప్రాంతాలు, యాంఫీథియేటర్, సారంగధర మఠం తదితర వాటిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ వలయ రహదారిలోని చుట్టు ప్రక్కల గల పిచ్చిమొక్కలను, బండరాళ్ళను తదితర వ్యర్థాలను తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా యాంపిథియేటర్ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా పరిసరాలలో పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను, వ్యర్థాలను తొలగించాలని పారిశుద్ధ్యపు అధికారులను ఆదేశించారు.
సారంగధర మఠం వద్ద వర్షపు నీటితో పాటు కొట్టుకువచ్చే వ్యర్థాలు, గుండాలలో కలవకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుండాలలో వ్యర్థాలు కలవకుండా ఉండేందుకు గుండాలచుట్టూ సిమెంట్ గట్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని బాహ్య వలయ రహదారిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని భద్రతావిభాగాన్ని ఆదేశించారు. ఈ విషయములో స్థానిక పోలీసుశాఖవారి సహకారాన్ని తీసుకోవాలన్నారు. బాహ్య వలయ రహదారి విభాగిణిలలో పచ్చదనాన్ని మరింతగా పెంచాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఐ/సి) పి. చంద్రశేఖరశాస్త్రి, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.