
శ్రీశైల దేవస్థానం:ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా వేకువజామున శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజాదికాలు, రావణవాహనసేవ జరిపారు.
ఈ ఉదయం గం. 3.00లకు ఆలయ ద్వారాలను తెరచి మంగళ వాయిద్యాల అనంతరం గం.3.30 ని!!లకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు జరిపించి గం.4.30l|లకు స్వామివారికి, తరువాత అమ్మవారికి మహా మంగళ హారతులు ఇచ్చారు.
మహా మంగళ హారతుల తరువాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపములో ఉత్తర ముఖంగా వేంచేబు చేయించి విశేష పూజాదికాలను జరిపారు.ఈ పూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవసంకల్పాన్ని పఠించారు.ఈ ఉత్సవ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని కోరారు.
అనంతరం ఉత్సవపూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు. మహాగణపతి పూజ తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజాదికాలను జరిగాయి.
తరువాత ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం నుండి వెలుపలకు తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలోనే రావణవాహనంపై ఆశీనులను చేయించి రావణవాహన సేవ జరిపారు.
తరువాత రావణ వాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరిపారు.శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను దర్శనానికి, అర్జిత సేవలకు అనుమతించారు.కాగా గ్రామోత్సవం తరువాత కూడా భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున (బలిపీఠం సమీపంలో) వేంచేబు చేయించారు.