
శ్రీశైల దేవస్థానం:భారత రాష్ట్రపతి ఈ నెల 26న శ్రీశైలం రానున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులు రాష్ట్రపతి ప్రారంభించనున్నారు..
ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సంబంధిత దేవస్థాన అధికారులు, పర్యాటక సంస్థ అధికారులతో కలసి మంగళవారం క్షేత్రంలో పర్యటించి ఆయా ఏర్పాట్లపై పలు సూచనలు, ఆదేశాలను జారీచేశారు.
హేమారెడ్డి మల్లమ్మమందిరం సమీపంలో నిర్మించిన సాంస్కృతిక ప్రదర్శనశాల (యాంఫీ థియేటర్) , హఠకేశ్వరం, శిఖరేశ్వరం వద్ద నిర్మించిన యాత్రిక సౌకర్యాల కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ ఈ నెల 24తేదినాటికి పూర్తిచేయాలని అన్నారు. ముఖ్యంగా అన్ని భవనాల వద్ద అవసరమైన మేరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.ప్రతి భవనం వద్ద కూడా పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.అంతకుముందు ఆలయప్రాంగణములో పర్యటించి ఏర్పాట్ల అంశాలను అధికారులు, అర్చక సిబ్బందితో చర్చించారు.
ఈ పర్యటనలో దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి.రామకృష్ణ, పర్యాటక సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు బి. ఈశ్వరయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ/సి) చంద్రశేఖరశాస్త్రి, పర్యాటక సంస్థ సహాయ ఇంజనీరు హెచ్.కె. నారాయణరావు, సహాయ ఇంజనీర్లు రంగప్రసాద్, రాజారావు, సీతారమేష్, ఉద్యానవన అధికారి లోకేష్, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.