జనవరి నుండి రాత్రి వేళలో కూడా భక్తులకు ఉచిత స్పర్శదర్శనం అవకాశాల పరిశీలన-ఈ ఓ
శ్రీశైలదేవస్థానం: జనవరి నుండి రాత్రి వేళలో కూడా భక్తులకు ఉచిత స్పర్శదర్శనం అవకాశాలపై పరిశీలిస్తామని ఈ ఓ చెప్పారు.భక్తుల సౌకర్యార్థం కార్యనిర్వహణాధికారి ఈ రోజు (29.12.2021) డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది.దేవస్థానం పరిపాలనా విభాగం లోని సమీక్షా సమావేశ మందిరం లో జరిగిన ఈ కార్యక్రమం లో పలువురు భక్తులు కార్యాలయానికి ఫోన్ ద్వారా పలు సూచనలు, సలహాలు అందజేశారు.
హైదరాబాద్, విజయవాడ, అమలాపురం, ఒంగోలు, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి భక్తులు కార్యక్రమం లో పాల్గొన్నారు.
పలువురు భక్తులు, మాములు రోజులలో స్వామివార్ల ఉచిత స్పర్శదర్శన కాలపరిమితి పెంపుదల చేయవలసినదిగా కోరారు. అందుకు కార్యనిర్వహణాధికారి , జనవరి నుండి రాత్రి వేళలో కూడా భక్తులకు ఉచిత స్పర్శదర్శనం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు . ప్రస్తుతం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2.30గంటల నుంచి భక్తులను గంటపాటు ఉచిత స్పర్శదర్శనానికి అనుమతీస్తున్నారు.
మరికొంత మంది భక్తులు, గంగా – గౌరీ సదన్ లో ఆర్.ఓ ప్లాంట్ లో శుద్ధి చేసిన మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు. అందుకు కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ క్షేత్రములో పలుచోట్ల శివగంగా జలప్రసాద పథకం ద్వారా మినరల్ వాటర్ పాయింట్లను ఏర్పాటు చేసామని, గంగా –గౌరీ సదన్ తో పాటు మల్లికార్జునసదన్, పాతాళేశ్వర సదన్ మొదలైన చోట్ల కూడా మంచినీటి సరఫరా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మరో భక్తుడు మాట్లాడుతూ అమలాపురం నుంచి శ్రీశైలానికి రాత్రివేళ ఆర్.టి.సి వారు ఒక బస్సును మాత్రమే నడుపుతున్నారని, మరో బస్సును కూడా ఏర్పాటు చేయాలన్నారు. అందుకు కార్యనిర్వహణాధికారి అదనపు ఆర్.టి.సి. బస్సు సర్వీసు ఏర్పాటు సాధ్యసాధ్యాల విషయమై ఆర్.టి.సి అధికారులతో చర్చిస్తామన్నారు.
మరికొంతమంది భక్తులు, దర్శనపు ఏర్పాట్లు, శ్రీశైలప్రభ చందా నమోదు మొదలైన విషయాల గురించి డయల్ ఈ ఓ కార్యక్రమం లో మాట్లాడారు.
ఈ కార్యక్రమం లో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమం లో భక్తులు తెలియజేసిన సూచనలు, సలహాల గురించి అధికారులతో కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ భక్తులు తెలియజేసిన ఆయా అంశాలపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సంబంధిత విభాగాలవారిని ఆదేశించారు. దేవస్థానంలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి కూడా విధులపట్ల అంకితభావంతో వ్యవహరించాలన్నారు. దాని వలన భక్తులకు మెరుగైన సేవలను అందించవచ్చన్నారు. ముఖ్యంగా భక్తుల సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
Post Comment