శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం: దేవస్థానం ఈ రోజు (01.06.2021) న  ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించింది.

ప్రతి మంగళవారం,  కృత్తికా నక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో ఎటువంటి శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి.  సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని నమ్మకం.

ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.

తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపి, అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము చేసిన అనంతరం సుబ్రహ్మణ్యస్తోత్రము పారాయణలు చేశారు.

సుబ్రహ్మణ్యస్వామి అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు,తేనే,నెయ్యి, కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలైన దానిమ్మ, కమలా, ద్రాక్ష, అరటి మొదలైన వాటితో అభిషేక కార్యక్రమం నిర్వహించారు.

అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ కుమారస్వామికి విశేషార్చనలు జరిపించారు. బయలు వీరభద్ర స్వామికి , నందీశ్వర స్వామికి కూడా విశేష పూజలు జరిగాయి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.