తిరుపతి, 2021 ఫిబ్రవరి 19:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారు ఏడు వాహనాలపై భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరగనుంది. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝూన్సీరాణి, విజివో మనోహర్, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ గోపాలకృష్ణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్ పాల్గొన్నారు.
భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్ను ఆలయంలోని కల్యాణ మండపంలో వేంచేపు చేసి, గంగాళంలో చక్రస్నానం నిర్వహించారు.
అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి , సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 7.00 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్రెడ్డి, సూపరింటెండెంట్లు రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కామరాజు, మునీంద్రబాబు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.