ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఆదివారం తెలంగాణ సారస్వత పరిషత్ సభా మందిరంలో నిర్వహించిన శతావధాన కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో అవధాని జీఎం రామశర్మ ఆశువుగా వినిపించిన పద్యం-వచన గేయం:
పద్యం:
——–
షీటీమ్స్ కల్పించి కేటుగాళ్లకు దుమ్ము దులిపించి వనితకు దృతిని పెంచి
సన్నబియ్యంతో అన్నదానం చేసి ఆహార భద్రతను ఆదరించి
ఆసరా పథకాన ఆశద్యుతులనించి కళ్యాణలక్ష్మితో కాంతి పెంచి
మిషన్ భగీరథన్ మేలెంచి పాలించి కాకతీయ మిషన్ కళలనించి
హరితహారంబుతో నేలనలర చేసి
ప్రీతికోతలు లేని కరెంట్ నిచ్చి
జనము నీరాజనము పలక ఘనకృతిమెయి
మనతెలంగాణ ప్రభుతయే మాన్యచరిత
ఈ తెలుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరమంతా ఆనందోత్సాహాలతో నర్తిస్తున్న తరుణంలో, ఈ
ఆనందహేలలో ఒక గేయం:
తెలంగాణ నేల వెలుగు తెలుగుమహాసభలు
తెలంగాణ మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు
బాసరపురి బాసతల్లి భాసురముగ దీవింపగ
కీసరగిరి రామలింగస్వామి కరుణ కురిపించగ
యాదశైల నృసింహుడు లాదమునే పంచుచుండ
ఆలంపూర జోగులాంబ అలంకారమై నిలువగా
తెలంగాణ నేల వెలుగు తెలుగుమహాసభలు
తెలంగాణ మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు
నగరం నందనవనమై నవనవమై నర్తింపగ
పలుకుబడుల సొమ్ముతో ప్రకృతి మాట పులకించగా
మన సంస్కృతీ సౌరభాలు మహినంత వ్యాపించగా
తెలంగాణ నేల వెలుగు తెలుగుమహాసభలు
తెలంగాణ మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు
మారన మల్లియరేచన మల్లినాద ధర్మన్నలు
పోతన తెలుగన్న భళీ పాలకురికి సోమన్నయూ
కాళోజీ సినారేలు కరములెత్తి దీవింపగా
తెలంగాణ నేల వెలుగు తెలుగుమహాసభలు
తెలంగాణ మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు
ఉద్యమ విద్యుత్ కిరీటి సద్యోవాక్కుల మేటి
కేసీఆర్ కళాహృదయ కేతనమై నూతనమై
జయశంకర శ్రీకరాత్మ జయమంత్రము నందింపగ
తెలంగాణ నేల వెలుగు తెలుగుమహాసభలు
తెలంగాణ మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు
ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఉపన్యాసంలో చదివిన పద్యాలు:
—————————————————————-
అటజని కాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల
ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత జాలము శీతశైలమున్
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్క బూనీ
తాచిన, యది నీకు మన్ననయ, చెల్వగు నీ పద పల్లవంబు
మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచునే
ననియెద నల్క మానవుగదా యికనైన నరాళకుంతలా!