తిరుప్పావై – వైదిక నేలపై తిరుప్పావై వ్రతం ఘనంగా ప్రారంభమైంది . అమ్మవారి దాసుడు సేతు రామన్ అందిస్తున్న , తిరుప్పావై పాశురాల వ్యాఖ్యానం- 16.12.2017…..మొదటి పాశురం- నోము నోచుటకు పిలుపు .
పాశురం –1:
మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్.
అర్థం:
శుభ మార్గశిర( ధనుర్మాసం) మొదటి రోజు నేడు .ఈ రోజు నుంఛి నేను ఒక వ్రతం ఆచరించబోతున్నాను.
భగవంతుణ్ణి పొందగోరు ప్రతి ఒక్కరు నాతో కలిసిరండి. భగవంతుడైన శ్రీమన్నారాయణుడే గోకులమునందు ,యశోద నందుల పుత్రుడిగా జన్మించాడు.అతడి వలననే గోకులము సుఖ సంతోషాలతో వెలుగొందుతున్నది. శ్రీమన్నారాయణుడే మనకు పరమ పురుషార్థమగు మోక్షాన్ని ఇవ్వగలడు. కాబట్టి అతడిని కీర్తించి తరిద్దాము….
పాశురంలో అంతరార్థం:
ఈ పాశురంలో గోదాదేవి తాను ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎలా ఆచరించాలనుకొంటున్నదో తెలుపుతున్నది. తాను ఒక్కతే కాకుండా భగవత్భక్తులందరితో కలిసి భగవంతుణ్ణి అర్చించాలనుకొంటున్నది.ఇదే విషయాన్ని ఋగ్వేదం కూడా” సభయానిషీదత…..” అంటూ భగవంతుణ్ణి అందరూ కలిసి ఆరాధించాలంటున్నది.
ఈ పాశురంలో మరో విశేషం…. ఉపాయ స్వరూపం, అధికారి స్వరూపం & ఫల స్వరూపం తేటతెల్లమైంది .
పొందగోరు మోక్షం ఫలం అనబడుతుంది.ఆ ఫలమును పొందే మార్గం ఉపాయమనబడుతుంది.ఆ ఫలమును పొందే వారు అధికారి.
ఇక్కడ అధికారి అంటే భగవత్భక్తులoదరు(నమక్కే). ఫలమగు మోక్షాన్ని పొందే మార్గమగు ఉపాయము అతడి శ్రీ పాదములను ఆశ్రయించడం.
కాబట్టి మోక్షం పొందే మార్గం ఒక్కటే….నారాయణుని శ్రీ పాదముల వద్ద శరణాగతి చేయడం.అప్పుడు అతడు తన కరుణ చేత మనకు మోక్షాన్ని అనుగ్రహిస్తారు.
…శ్రీ గోదా దేవ్యై నమః
….ఆదిగురు తిరువడిగలే శరణం.