శ్రీశైల దేవస్థానంలో జ్వాలావీరభద్రస్వామికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని జ్వాలావీరభద్రస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అమరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజిస్తారు.  ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.

ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది.ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపించారు.

తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ,  మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకాన్ని నిర్వహించారు.ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను జరిపారు. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ వీరభద్రస్వామివారికి విశేషార్చనలు జరిపించారు.

శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం:

 దేవస్థానం ఈ రోజు ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. ప్రతి బుధవారం, సంకటహరచవితి రోజులు ,పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం,  పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు.

ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం జరిగింది. తరువాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిగాయి .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.