శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం వారు ఈ రోజు 8 న సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించారు.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజిస్తారు. ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది. ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, 5 రకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ, మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం జరిపారు. ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చన జరిపారు.
| శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం |
లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు, పౌర్ణమిరోజులలో శ్రీ సాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానంసేవగా సర్కారిసేవగా నిర్వహిస్తున్నారు.ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం జరిగింది. తరువాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపారు.