శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 04.03.2021 నుండి 14.03.2021 వరకు 11 రోజులపాటు జరుగనున్న సందర్భంగా
వివిధ ఏర్పాట్లను చేస్తున్నారు . ఇందులో భాగంగా ఈ రోజు (10.02.2021) న కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామ రావు క్షేత్రపర్యటన చేసి సంబంధితులకు పలు ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి వస్తారని , భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు.ముఖ్యంగా తాత్కాలిక వసతి, మంచినీటి సదుపాయం, సౌకర్యవంతమైన దర్శనం, అన్నదానం, పారిశుద్ధ్యం మొదలైన అంశాలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.భక్తులరద్ధీకనుగుణంగా అవసరమైన మేరకు కొబ్బరికాయలను అందుబాటులో ఉంచాలన్నారు. కొబ్బరికాయల నిర్వహణకుగాను స్టాకు రూమును ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పెద్దసత్రం వద్ద సామాన్లు భద్రపరుచుకునే గదిని విస్తరింపజేయాలన్నారు. భక్తులు సులభంగా వారి సామాన్లు అప్పగించడం, తిరిగి వాటిని పొందడం కోసం వేరు వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యశాల వద్ద అంబులెన్స్ పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయం లో తాత్కాలిక వసతి కల్పించేందుకు శివసదనం ఎదురుగా ప్రదేశాన్ని ( పెట్రోల్ బంక్ పక్కగా) చదును చేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. చదును చేసిన ఈ ప్రదేశం లో పైప్ పెండాల్స్, మంచినీటి సదుపాయం మొదలైనవాటిని కల్పించాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి డి.మల్లయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ విభాగ పర్యవేక్షకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.