శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్ర భద్రత ఎంతో ముఖ్యమని ఈ ఓ ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం భద్రతా సిబ్బందికి విధులపై అవగాహన శిక్షణా కార్యక్రమం ఈ రోజు 17 న జరిగింది. శ్రీశైల దేవస్థానములో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి విధుల నిర్వహణ పట్ల అవగాహన కలిగించేందుకు శివదీక్షా శిబిరాల వద్దగల ఫుడ్ కోర్టులోఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమములో ఆత్మకూరు డీఎస్పీ శ్రీ వెంకట్రావ్ భద్రతా సంబంధి అంశాలకు సంబంధించిన పలు విషయాల గురించి వివరించారు.శిక్షణా కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీంద్ర, స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్ హరిప్రసాద్ పాల్గొన్నారు.
దేవస్థానంలో ప్రైవేటు ఏజెన్సీ, హోంగార్డ్స్, ఎస్.పి.ఎఫ్, ఎ.ఆర్. గార్డ్సు విభాగాల నుంచి మొత్తం 209 మంది సిబ్బంది భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బందికి రెండు విడతలుగా అనగా మొదటి బృందానికి ఈ ఉదయం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రెండో బృందానికి ఈ మధ్యాహ్నం శిక్షణ నిర్వహించారు.
ముందుగా కార్యనిర్వహణాధికారి స్వాగత ప్రసంగం చేశారు. శ్రీశైల క్షేత్రాన్ని ప్రతిరోజు కూడా వేలాది సంఖ్యలో భక్తులు సందర్శిస్తున్నారని ,అందుకే క్షేత్ర భద్రత ఎంతో ప్రాముఖ్యత గల అంశమన్నారు. ఈ కారణముగా భద్రతా సిబ్బంది విధినిర్వహణ సమయములో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రతా సిబ్బంది వారికి నిర్దేశించిన ప్రదేశాలలో విధులు నిర్వహిస్తున్నప్పుడు భక్తులతో పూర్తి మర్యాదగా మెలగాలని, క్షేత్రాన్ని సందర్శించే ప్రతిభక్తుడిని అతిథిగా చూడాలన్నారు. సిబ్బంది వారివారి విధుల్లో ఉన్నప్పుడు భక్తులు అడిగే సాధారణ సమాచారాన్ని కూడా అందించాలన్నారు. అదేవిధంగా క్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడంలో కూడా భద్రతా సిబ్బంది ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు.
డీఎస్పీ మాట్లాడుతూ భద్రతా పటిష్టతకు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు.భద్రతా సిబ్బంది క్రమశిక్షణతో మెలుగుతూ విధుల నిర్వహణపట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా ఎవరికివారు స్వీయనియంత్రణను కలిగివుండి, నైతిక బాధ్యతతో మెలగాలన్నారు.
క్షేత్రపరిధిలో రాష్టదేవదాయ ధర్మదాయచట్టాన్ని అమలు చేసే విషయానికి సంబంధిచిన పలు అంశాలను డీఎస్పీ ఎంతో వివరముగా చెప్పారు. భద్రతా చర్యలతో పాటు క్షేత్రపవిత్రతను కాపాడే బాధ్యత కూడా భద్రతా సిబ్బందిపై ఉంటుందన్నారు. శ్రీశైల మహాక్షేత్రం ఎంతో ప్రసిద్ధి పొందిన క్షేత్రమని, రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలమూలల నుంచి కూడా భక్తులు భక్తి విశ్వాసాలతో క్షేత్రాన్ని సందర్శిస్తుంటారన్నారు. క్షేత్రపవిత్రతను కాపాడవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. ఈ విషయములో భద్రతా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు.భక్తుల మనోభావాలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా భద్రతా విభాగంపై ఉందన్నారు.దేవదాయచట్టాన్ని అనుసరించి క్షేత్రములోకి నిషేధిత వస్తువులైన ధూమపానం సంబంధి వస్తువులు, మత్తు పానీయాలు మొదలైనవాటిని అనుమతించకూడదన్నారు. ఇందుకుగాను టోల్ గేట్ వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తూ పూర్తి అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు. భద్రతా సిబ్బంది అటు భక్తులకు భద్రత కల్పించడంతో పాటు ఆలయ ఆస్తుల పరిరక్షణ, క్షేత్రరక్షణ మొదలైన అంశాలపట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండాలన్నారు.ఆలయములో దర్శనం క్యూలైన్ల నిర్వహణ, రద్ధీక్రమబద్ధీకరణ, వాహనాలు రాకపోకల క్రమబద్దీకరణ, వాహన పార్కింగ్ ప్రదేశాలు మొదలైన చోట్ల పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. క్షేత్రములో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసే బాధ్యత కూడా భద్రతా సిబ్బంది కలిగి ఉండాలన్నారు. క్షేత్రపరిధిలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించడం పట్ల భద్రతా సిబ్బంది పూర్తి శ్రద్ధను కనబర్చాలన్నారు.
ఈ అవగాహన కార్యక్రమములో దేవస్థాన ముఖ్యభద్రతాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రజా సంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.