తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన కొత్తగా ప్రవేశపెట్టిన వైయస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుంచి, అటూ కేంద్రం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ పథకాలతో గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం, తగిన పౌష్టికాహారం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి ముఖ్యమైన అడుగు వేసిందని సోమవారం ట్వీట్ చేసింది. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్ఆర్ సంపూర్ణ పో షణ ప్లస్ పథకాల మోనూ గురించి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వైయస్సార్ సంపూర్ణ పోషణ
► గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు.
► నెలకు ఒక కేజీ రాగి పిండి, ఒక కేజీ సజ్జ/జొన్న పిండి, ఒక కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, 250 గ్రాముల ఎండు ఖర్జూరం.
వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్
► గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు.
► బెల్లం 500 గ్రాములు, మల్టీ గ్రెయిన్ ఆటా 2 కేజీలు, ఎండు ఖర్జూరం, సజ్జ/ జొన్న పిండి.. 500 గ్రాములు ఇస్తారు.
► 6 నెలల నుంచి 36 నెలల వయసున్న పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద 2.5 కేజీల బాలామృతం, 25 కోడి గుడ్లు, 2.5 లీటర్ల పాలు. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కింద 2.5 కేజీల బాలామృతం, 30 కోడిగుడ్లు, 6 లీటర్ల పాలు ఇస్తారు.
► 3 ఏళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉన్న పిల్లలకు సంపూర్ణ పోషణలో 20 గ్రాములు ఉడికించిన శనగలు, రోజూ కోడిగుడ్డు, 100 మి.లీ పాలు. సంపూర్ణ పోషణ ప్లస్ పథకంలో బాలామృతంతో చేసిన లడ్డు/ కేకు 50 గ్రాములు, ప్రతి రోజూ కోడి గుడ్డు, 200 మి.లీ పాలు ఇస్తారు. ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో చేసి సాంబారుతో మధ్యాహ్న భోజనం.