బాలల దినోత్సవమైన నవంబర్ 14న తెలంగాణ రాష్ట్రంలో 1500 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ లను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (విద్యశాఖ మంత్రి) శ్రీ కడియం శ్రీహరి వెల్లడించారు.
శుక్రవారం సచివాలయంలో డిజిటల్ క్లాస్ రూములను ప్రారంభించడానికి తీసుకోవాలసిన చర్యలపై సంబంధిత శాఖాధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రంజీవ్ ఆర్. ఆచార్య, గిరిజన మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ , సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ బెనహర్ మహేష్ దత్ ఎక్కా, ఐ.టి. శాఖ కార్యదర్శి శ్రీ జెయేష్ రంజన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ ఓమర్ జలీల్ , మనటివి సిఇఓ శ్రీ శేలేష్ రెడ్డి, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ శ్రీ కిషన్ , రెసిడెన్సియల్ స్కూల్ డైరెక్టర్ శ్రీమతి శేషు కుమారి, మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ డైరెక్టర్ శ్రీ షఫిఉల్లా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి నాయకత్వంలో విద్యార్ధుల కు డిజిటల్ లిటరసీలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. నవంబర్ 14న 1500 పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూములను ప్రారంభించటానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. డిజిటల్ క్లాస్ రూమ్ లు ప్రారంభించే పాఠశాలల వివరాలను జిల్లాల వారిగా తయారు చేయాలని, ఆయా పాఠశాలల్లో మౌళిక వసతులు, ఇక్విప్ మెంట్ , చేపట్టవలసిన రిపేర్లు పాఠశాలల వారిగా రూపొందించాలన్నారు. డిజిటల్ క్లాసులు ప్రారంభించే పాఠశాలల్లో టీచర్లకు అవసరమైన శిక్షణ ను నవంబర్ 10 లోగా పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైన సబ్జెక్ట్ కాంటెంట్ ను పాఠశాలలకు అందించాలన్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు హింది మినహా మిగతా 5 సబ్జెక్టులలో ఎస్.సి.ఇ.ఆర్.టి. రూపొందించిన సబ్జెక్ట్ కాంటెంట్ ను విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూం ద్వారా బోధించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో దశల వారిగా డిజిటల్ క్లాస్ రూం లలో పాటు కంప్యూటర్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఎంపిక చేసిన 1500 పాఠశాలల్లో ఆన్ లైన్, ఆఫ్ లైన్, మన టివి ద్వారా డిజిటల్ తరగతుల పై శిక్షణ నివ్వడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించడానికి అన్ని జిల్లాలో కళాశాలలను గుర్తించడం జరిగిందని, దీనికనుగుణంగా షెడ్యూల్డ్ ను రూపొందించు కోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
నవంబర్ 14న సాంఘిక , బి.సి.గిరిజన , మైనారిటీ, రెసిడెన్సియల్ పాఠశాలలు, కె.జి.బి.వి.లు (కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు) ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన శాఖలు సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించుకొని ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.