గ్రామాలలో ఈ నెల 10 నుంచి రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి పకడ్భంది ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి రైతు బంధు చెక్కులు,కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్లతో సి.యస్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
సి.యస్ మాట్లాడుతూ చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా మంచి నీటి సదుపాయం, ఓటరు స్లిప్ ల జారీ, ఎండబారిన పడకుండా షెడ్ నెట్స్ కల్పించాలన్నారు. గ్రామాల వారిగా పంపిణీ షెడ్యూలను ముందుగానే రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 57.33 లక్షల పాసు పుస్తకాలకుగాను 52.73 పాసుపుస్తకాలకు ఆధార్ సీడింగ్ పూర్తి అయ్యిందన్నారు. దాదాపు 3.30 లక్షల ఖాతాలకు సంబంధించి ఆధార్ సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. సాంకేతిక సమస్యలతో ఆధార్ లేని వారికి చెక్కులను నిరాకరించకుండా చూడాలని, వారి వివరాలు తీసుకొని ఆధార్ జారీకి చర్యలతో పాటు బయోమెట్రిక్ వివరాలను పొందాలన్నారు. తదుపరి వీరికి పాసుపుస్తకాల జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. వీరి డాటాను ఎప్పటికప్పుడు సి.సి.ఎల్.ఏ కార్యాలయానికి పంపాలన్నారు. రైతు బంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్ల కోసం జిల్లాకు 2 కోట్ల రూ.ల చొప్పున మంజూరు చేసినట్లు సి.యస్ తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉదయం 7 గం.ల నుండి 11 గం.ల వరకు, సాయంత్రం 5 గం.ల నుండి 7గం.ల వరకు పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్ ఓఎఫ్ ఆర్, అసైన్డ్ ల్యాండ్ కు సంబంధించిన రైతులకు చెక్కులు జారీ చేసేలా చూడాలన్నారు. 23 జిల్లాలలోని 182 మండలాలలో 91,992 మంది లబ్దిదారులకు సంబంధించి 2.99 లక్షల ఎకరాలకు ఆర్ ఓఎఫ్ ఆర్ సర్టిఫికేట్లు ప్రకారం 119కోట్లు ఇస్తామన్నారు . చెక్కుల విత్ డ్రా సమయంలో నగదు కొరత రాకుండా బ్యాంకర్లతో సమీక్షించాలన్నారు. మండలాలకు వెళ్ళే బృందాలు తప్పనిసరిగా పహాణీ ప్రింటౌట్ ను వెంట తీసుకువెళ్ళాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ సమయంలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రైతులు తమ చెక్కులను నగదుగా మార్చుకునే సమయంలో ఫోటో ఐడెంటిటీ ఆధారంగా డబ్బులు ఇచ్చేలా బ్యాంకర్లను ఆదేశించాలన్నారు.
రైతు బంధు చెక్కులకు సంబంధించి 58.06 లక్షల చెక్కులను ముద్రించామని, 54.3లక్షల చెక్కులు ఇప్పటికే మండలాలకు చేరాయని, మిగతా 3.75 లక్షల చెక్కులు 2 లేదా 3 రోజులలో జిల్లాలకు చేరుకుంటాయని సి.యస్ తెలిపారు. ప్రతి చెక్కుకు సంబంధించి అకౌంట్ చేయాలని సి.యస్ అన్నారు. ఇప్పటికే మండలాలకు చేరిన చెక్కుల వివరాలను వెరిఫై చేసుకోవాలన్నారు. పంపిణీ చేసిన చెక్కులతో పాటు పంపిణీ చేయని చెక్కుల వివరాలు రూపొందించుకోవాలన్నారు.
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిరాజేశ్వర్ తివారి మాట్లాడుతూ ధరణి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఈ నెల 7 నుండి ప్రయోగాత్మకంగా 5 మండలాలో, ఈ నెల 19 నుండి జిల్లాకు ఒక్కటి చొప్పున 30 మండలాలలో తహసీల్దార్ల ద్వారా రిజిష్ట్రేషన్ కార్యకలాపాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. దీనిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి తహసీల్దార్లకు తగు శిక్షణతో పాటు రిజిస్ట్రేషన్లు జరగేలా చూడాలన్నారు.
వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి మాట్లాడుతూ కలెక్టర్లు ముఖ్యభూమిక పోషించాలని, రైతులు తమ చెక్కులను నగదుగా మార్చుకునే విషయమై తగు ఆదేశాలు జారీచేస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు.
సి.యం.ఓ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి స్మితాసబర్వాల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆధార్ వివరాలు సమర్పించని రైతుల వివరాలను గ్రామాల వారిగా తయారు చేసి గ్రామాలలో చదవాలన్నారు. పూర్తి వివరాలు నమోదైన ఖాతాలకు సంబంధించిన వెంటనే డిజిటల్ సిగ్నెచర్లు చేసి పాసుపుస్తకాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో సిసియల్ ఏ డైరెక్టర్ శ్రీమతి కరుణ, వ్యవసాయశాఖ కమీషనర్ జగన్ మోహన్, ధరణి స్పెషల్ ఆఫీసర్ రజత్ కుమార్ షైనీ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి దివ్య, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్,లతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.