హైదరాబాద్-మహిళా చైతన్యంలో వీఓఏలది కీలక పాత్ర అని…హరితహారం, స్వచ్ఛ తెలంగాణాల్లో వీఓఏలు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలని పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. సాగర్ రింగ్ రోడ్ లోని జంగారెడ్డి ఫంక్షన్ హాల్లో వీఓఏల (విలేజ్ ఆర్గనైజేషన్స్ అసిస్టెంట్లు) రెండవ మహాసభ శుక్రవారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ…గ్రామాభివృద్ధిలోనూ, మహిళలను సంఘటితం చేయడంలోనూ వీఓఏలది కీలక పాత్ర అని కొనియాడారు. వీఓఏలకు మూడు వేల రూపాయల వేతనం ఇచ్చి గౌరవించిన ఘనత టిఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గ్రామైఖ్య సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీఓఏలు కృషి చేయాలని.. తద్వారా గ్రామైఖ్య సంఘాల ద్వారా కూడా మరో రెండు వేల వేతనాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ వీఓఏలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. పచ్చదనం–పరిశుభ్రత ద్వారానే గ్రామాలు బాగుపడతాయని… వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారాన్ని విజయవంతం చేయడానికి వీఓఏలు కృషి చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్థానికంగా కుటీర పరిశ్రమల ఏర్పాటు, ఆన్లైన్ మార్కెటింగ్ను వినియోగించుకోవడం లాంటి కార్యక్రమాలను మహిళా సంఘాలు చేపట్టేలా వీఓఏలు వారిని చైతన్యం చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రధానంగా విద్య, వైద్యంపై అధికంగా ఖర్చు చేసే పరిస్థితులున్నాయని…వీటిని మార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను, పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, విద్యను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వీఓఏల భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మరో మంత్రి జోగు రామన్నమాట్లాడుతూ..వీఓఏలకు వేతనాలు ఇచ్చి గౌరవించిన ఘనత మంత్రి జూపల్లి, సీయం కేసీఆర్కు దక్కుతుందన్నారు. అడవులు లేకపోవడం వల్లే వర్షాలు సమృద్ధిగా కురవడం లేదన్న మంత్రి జోగు రామన్న…హరితహారాన్ని వీఓఏలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి వ్యక్తి కనీసం ఆరు మొక్కలు పెంచేలా చైతన్యం చేయాలన్నారు. టిఆర్ ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం మూడు వేల రూపాయల వేతనాన్ని ఇచ్చి వీఓఏలను గౌరవించిన టిఆర్ ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వీఓఏల సంఘం ప్రధాన కార్యదర్శి మాధవి అన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను గుర్తించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమకు వేతనాలను ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించడంతో పాటు, భీమా కల్పించేందుకు ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, వీఓఏల సంఘం గౌరవాధ్యక్షుడు రూప్సింగ్, వీఓఏల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోటేశ్వర్రావు, మాధవి, టిఆర్ ఎస్ కార్మిక విభాగం నేతలు రాంబాబు యాదవ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. print Post navigation కేసీఆర్ కు కృతజ్ఞతలు Modi emplanes for New Delhi from Air Force Base Waterkloof